బంగారు పంట పండింది! | Sovereign Gold Bond Boom Rs 1 Lakh Turns Into Rs 3 19 Lakh RBI Premature Redemption | Sakshi
Sakshi News home page

బంగారు పంట పండింది!

Jun 15 2026 8:39 PM | Updated on Jun 15 2026 8:44 PM

Sovereign Gold Bond Boom Rs 1 Lakh Turns Into Rs 3 19 Lakh RBI Premature Redemption

బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి అక్షరాలా కాసుల వర్షం కురిసింది. సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) 2020-21 సిరీస్-3 ఇన్వెస్టర్లు ఊహించని రీతిలో భారీ లాభాలను అందుకోబోతున్నారు. ఈ సిరీస్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా ప్రిమెచ్యూర్‌ రిడంప్షన్‌ ధరను ప్రకటించింది. జూన్ 16, 2026 నుంచి ఈ బాండ్లను ముందస్తుగా రీడీమ్ చేసుకునేందుకు ఆర్‌బీఐ అవకాశం కల్పించింది. గడచిన మూడు ట్రేడింగ్ రోజుల్లోని బంగారం ముగింపు ధరల సగటు ఆధారంగా.. ఈ విడత ప్రిమెచ్యూర్‌ రిడంప్షన్‌ ధరను గ్రాముకు రూ.14,774 గా ఆర్‌బీఐ నిర్ణయించింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, సావరిన్ గోల్డ్ బాండ్లు జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్లు పూర్తయిన తర్వాత, వడ్డీ చెల్లింపు తేదీల్లో ప్రిమెచ్యూర్‌ రిడంప్షన్‌కు అవకాశం ఉంటుంది.

ధర ఎలా లెక్కిస్తారంటే..

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించిన రేట్ల ప్రకారం... రిడంప్షన్ తేదీకి ముందు ఉన్న మూడు వ్యాపార రోజుల్లో 999 స్వచ్ఛత (24 క్యారెట్ల) బంగారం ముగింపు ధరల సాధారణ సగటును పరిగణనలోకి తీసుకొని ఈ ధరను ఖరారు చేశారు.

పెట్టుబడిదారులకు ఎంత రాబడి వస్తుంది?

ఈ సిరీస్ జారీ చేసిన సమయంలో ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు గ్రాముకు రూ.50 తగ్గింపుతో రూ.4,627 లభించగా, ఆఫ్-లైన్ ఇన్వెస్టర్లకు రూ.4,677 గా ఉంది. ప్రస్తుత రిడంప్షన్‌ ధర రూ.14,774గా ఉంది. దాంతో నికరంగా 215.88% శాతం లాభం చేకూరినట్లయింది.

గమనిక: ఈ లాభం బాండ్లపై లభించిన 2.5% వార్షిక వడ్డీ భాగం కాకుండా కేవలం బంగారం ధరల పెరుగుదల ద్వారా వచ్చిన నికర లాభం మాత్రమే.

రూ.లక్ష పెట్టుబడి.. రూ.3.19 లక్షలు!

ఈ లెక్కన 2020 జూన్‌లో ఈ బాండ్లలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన ఆన్‌లైన్ ఇన్వెస్టర్ ప్రస్తుత పెట్టుబడి విలువ ఏకంగా రూ.3.19 లక్షలకు పైగా పెరిగింది. దీనికి అదనంగా గడచిన ఐదేళ్లలో ఏటా లభించిన 2.5 శాతం వడ్డీ ఆదాయం అదనం.

పన్ను నిబంధనల్లో మార్పులు

ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సావరిన్ గోల్డ్ బాండ్లపై పన్ను నిబంధనలను సవరించినందున ఇన్వెస్టర్లు కొన్ని కీలక విషయాలను గుర్తుంచుకోవాలి.

  • ప్రైమరీ ఇష్యూ (మొదటగా ఆర్‌బీఐ వద్ద కొనుగోలు చేసిన) చందాదారులు కూడా ఐదేళ్ల తర్వాత ‍ప్రిమెచ్యూర్‌ రిడంప్షన్‌ చేసుకుంటే వచ్చే లాభాలపై మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

  • ఎస్‌జీబీ నిబంధనల ప్రకారం లభించే పూర్తి పన్ను మినహాయింపు ప్రయోజనం.. కేవలం 8 ఏళ్ల కాలపరిమితి ముగిసే వరకు బాండ్లను ఉంచుకునే అసలు చందాదారులకు మాత్రమే పరిమితం చేశారు.

  • స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా ఎస్జీబీలను కొనుగోలు చేసిన వారు ఆ బాండ్లను మెచ్యూరిటీ (8 ఏళ్లు) వరకు హోల్డ్ చేసినప్పటికీ.. సవరించిన నిబంధనల ప్రకారం వారికి ఇకపై పన్ను రహిత విముక్తి (Tax-free Redemption) లభించదు. వారు కూడా పన్ను చెల్లించాల్సిందే.

ఇదీ చదవండి: డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement