కరోనా తర్వాత కూడా చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగించాయి. అయితే.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీంతో సంస్థలన్నీ కూడా ఉద్యోగులను మళ్లీ ఆఫీసులకు పిలుస్తున్నాయి. ముందు పూర్తిగా ఇంటి నుంచి పని చేసే అవకాశం ఇచ్చిన ఓ కంపెనీ, ఇప్పుడు హైబ్రిడ్ వర్క్ మోడల్ను అమలు చేయడంతో ఓ ఉద్యోగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగికి ఐదేళ్ల అనుభవం ఉంది. ఏడాదికి పైగా ఒక కంపెనీలో పనిచేస్తున్న అతను, ప్రారంభంలో రిమోట్ ఉద్యోగం కావడంతో చేరాడు. కానీ ఆ కంపెనీ తాజాగా వర్క్ పాలసీ మార్చి, వారానికి రెండు రోజులు ఆఫీస్కు రావాలని చెప్పింది.
కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం ఆ ఉద్యోగికి సమస్యగా మారింది. ఆఫీస్కు వెళ్లి రావడానికి రోజుకు దాదాపు 115 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని అతను తెలిపాడు. వారానికి రెండు రోజులు మాత్రమే అయినప్పటికీ.. ఈ ప్రయాణం వల్ల సమయం, శ్రమ రెండూ ఎక్కువగా ఖర్చవుతున్నాయని చెప్పాడు. దీనికి తోడు కంపెనీలో జీతాల పెంపు ప్రక్రియ ఎలా ఉంటుందో?, కూడా స్పష్టత లేదని పేర్కొన్నాడు.
వర్క్ పాలసీలో మార్పు, కెరీర్ ఎదుగుదలపై అనిశ్చితి కారణంగా అతను కొత్త ఉద్యోగ అవకాశాలను వెతకడం ప్రారంభించాడు. మరో పూర్తిగా రిమోట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లే ముందు, ప్రస్తుత ఉద్యోగం ఎందుకు వదిలేయాలనుకుంటున్నానో?.. ఎలా చెప్పాలి అని నెటిజన్లను అడిగాడు.
2 days of commuting, 115 km/day. Is this a valid reason for job change?
by u/whoisthisonred in IndianWorkplace
ఇంటర్వ్యూలో.. సాధారణంగా అడిగే ప్రశ్న ''మీరు కొత్త ఉద్యోగం ఎందుకు వెతుకుతున్నారు?''. ఈ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో అనే విషయంలో సందేహం వచ్చింది. కేవలం ఎక్కువ దూరం ప్రయాణం కారణంగా.. ఉద్యోగం మారుతున్నట్లు చెప్పడం సరైనదేనా అని అడిగాడు.
తర్వాత జరిగిన ఇంటర్వ్యూ గురించి కూడా అతను తన రెడ్దిట్ పోస్టు ద్వారా వివరించాడు. ప్రస్తుత కంపెనీలో లేఆఫ్స్ జరుగుతున్నాయని, అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫీస్ తన ఇంటి నుంచి చాలా దూరంలో ఉందని చెప్పాడు. రిమోట్ ఉద్యోగాలకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని అడిగినప్పుడు, తనకు కేవలం ఇంటి నుంచి పని చేయడం మాత్రమే లక్ష్యం కాదని, రోజువారీ ప్రయాణం సులభంగా ఉండే మంచి పని వాతావరణం కావాలని స్పష్టం చేశాడు.
ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కొంతమంది ఉద్యోగి ఎదుర్కొంటున్న సమస్యను అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, గురుగ్రామ్, గ్రేటర్ నోయిడా వంటి ప్రాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణించడం చాలామంది ఉద్యోగులకు సాధారణ సమస్యగా మారిందని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం.. జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు రిమోట్ ఉద్యోగం దొరికినా, భవిష్యత్తులో ఆ కంపెనీ కూడా హైబ్రిడ్ విధానాన్ని తీసుకురాదనే గ్యారంటీ లేదని చెప్పారు. అందుకే కొత్త కంపెనీలో చేరే ముందు వర్క్ పాలసీపై పూర్తి స్పష్టత తీసుకోవాలని సూచించారు.


