తప్పులు సవరించుకున్న ఎన్‌సీఈఆర్‌టీ | Revised NCERT Class 8 textbook | Sakshi
Sakshi News home page

తప్పులు సవరించుకున్న ఎన్‌సీఈఆర్‌టీ

Jul 9 2026 1:06 AM | Updated on Jul 9 2026 1:06 AM

Revised NCERT Class 8 textbook

వివాదాస్పద భాగాల తొలగింపు

దేశ విభజనపై కాంగ్రెస్‌ వైఖరి వక్రీకరణ?

వివక్షకు కారణాల్లో ఆర్థిక వెనుకబాటూ జోడింపు!

న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై ఆరోపణలతో వివాదాలకెక్కిన జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఎట్టకేలకు తన తప్పులను దిద్దుకుంది. తాజాగా విడు దల చేసిన ఎనిమిదవ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో వివాదాస్పద భాగాలను తొలగించింది. కాకపోతే కొత్త పుస్తకంలోనూ కొన్ని సవరణలు చేసింది. దేశ విభజన విషయంలో కాంగ్రెస్‌ వైఖరిని వక్రీకరించింది. 

వీర్‌ సావర్కర్‌ స్వరాజ్‌ కోసం డిమాండ్‌ చేశాడన్న విషయాన్ని జోడించింది. జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్, నాజీ సిద్ధాంతాల ప్రస్తావనను తొలగించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌సీఈఆర్‌టీ ‘‘ఎక్స్‌ప్లోరింగ్‌ సొసైటీ: ఇండియా అండ్‌ బియాండ్‌’పేరుతో విడుదల చేసిన పాఠ్యపుస్తకంపై పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం తెలిసిందే. ఇందులోని ఒక అధ్యాయనంలో న్యాయవ్యవస్థలో అవినీతి, పెండింగ్‌ కేసుల ప్రస్తావనలు ఉండటం వివాదాస్పదమైంది.

 సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఏ రకంగానూ ఈ వివాదాస్పద పుస్తకం మళ్లీ ముద్రించకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఎన్‌సీఈఆర్‌టీ కూడా సుప్రీంకోర్టును క్షమాపణలు కోరింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఆ పాఠ్యపుస్తకాన్ని సమీక్షించింది. సవరణలతో కూడిన పుస్తకం ఇటీవలే అందుబాటులోకి వచ్చింది.

చేసిన మార్పులేమిటి?
స్వాతంత్రోద్యమం, దేశ విభజనకు సంబంధించి ఈ పుస్తకంలో ‘ఇండియాస్‌ లాంగ్‌రోడ్‌ టు ఇండిపెండెన్స్‌’పేరుతో ఒక అధ్యాయం ఉంది. అందులో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ కూడా దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించినట్లుగా రాశారు. అలాగే స్వాతంత్య్రం సంపాదించేందుకు దేశ విభజన ఒక్కటే మార్గమన్న విధానాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఎంచుకోవడం చర్చనీయాంశమని కూడా ఉంది. 

విభజన సమయంలో భారత ఉపఖండంలో మతహింసలు చెలరేగగా కాంగ్రెస్‌ అసహాయ స్థితిలో ఉండిపోయిందన్న వ్యాఖ్యను తొలగించారు. హిందూ, ముస్లిం నేతల మధ్య ఉన్న అభిప్రాయభేదాలను తమకు అనుకూలంగా మార్చుకున్న బ్రిటిష్‌ పాలకులు దేశాన్ని విభజించాలని నిర్ణయించారని, మహాత్మగాంధీ సహా కాంగ్రెస్‌ నేతలు కూడా విభజనను వ్యతిరేకించారని, కానీ చివరకు ముందుకెళ్లేందుకు అదొక్కటే మార్గమని అంగీకరించారన్న విషయాలను కూడా కొత్త పుస్తకంలో చేర్చలేదు. 

కొత్త పుస్తకంలో సంపూర్ణ స్వరాజ్యం డిమాండ్‌కు మరిన్ని వివరాలు జోడిస్తూ... 1925లో వీర్‌ సావర్కర్‌ కూడా స్వరాజ్‌ కోసం డిమాండ్‌ చేసినట్టుగా రాశారు. ఫిబ్రవరిలో ప్రచురితమైన పుస్తకంలో స్వాతంత్య్రం కోసం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ సాయుధ దళాన్ని అభివృద్ధి చేసేందుకు హిట్లర్‌ సాయం కోరినట్టు ఉంది. 

అలాగే హిట్లర్‌ నాజీ భావజాలం, విస్తరణవాదం ఫలితంగానే రెండో ప్రపంచయుద్ధం జరిగిందన్న వివరమూ కొత్త పుస్తకంలో లేకుండా చేశారు. సుభాష్‌ చంద్రబోస్‌ బ్రిటిష్‌ వ్యతిరేక శక్తుల సాయం కోరాడని మాత్రమే ఉంచారు. న్యాయవ్యవస్థకు సంబంధించిన ‘ద రోల్‌ ఆఫ్‌ జ్యుడిషరీ ఇన్‌ సొసైటీ’లో వివాదాస్పద అంశాలను తొలగించిన ఎన్‌సీఈఆర్‌టీ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, ట్రైబ్యునల్స్, ప్రత్యామ్నాయ విభేద పరిష్కార పద్ధతుల సమాచారం జోడించింది.  

‘ఆర్థిక నేపథ్యం’జోడింపు...
సమాజంలో వివక్షకు కులం, మతం, జాతి, లింగం, వైకల్యం, లైంగికతవి కారణమవుతున్నాయని ఫిబ్రవరిలో ప్రచురితమైన పుస్తకంలో ఉండగా కొత్తదాంట్లో ‘‘ఆర్థిక నేపథ్యం’’అనే అంశాన్ని చేర్చారు. ‘సిటిజన్‌షిప్‌: రైట్స్‌ అండ్‌ డ్యూటీస్‌’అన్న అధ్యాయంలో వివక్ష అనేది అనైతికమైంది మాత్రమే కాకుండా చట్టపరంగానూ నిషేధించిందని స్పష్టం చేశారు. ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాల నుంచి వచ్చిన వారు కూడా వివక్ష ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పారు. 

ఇటీవల యూజీసీ 2026 సమానత నియమావళి పై జరిగిన చర్చలో ఆర్థిక వెనుకబడిన స్థితి స్పష్టంగా రక్షిత వర్గంగా పేర్కొనలేదన్న విమర్శల మధ్య ఈ మార్పునకు ప్రాధాన్యమేర్పడింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రస్తావన పాఠ్యపుస్తకంలో, ఈ పుస్తకం సుప్రీం కోర్టు రిట్‌ పిటిషన్‌ (సివిల్‌) నెం: 1/2026 ద్వారా ఇచ్చిన ఆదేశాల మేరకు మళ్లీ ప్రచురించామని ఎన్‌సీఈఆర్‌టీ స్పష్టం చేసింది. కొత్త పుస్తకం తయారీలో పాల్గొన్న రచయితల సంఖ్య 51 నుంచి 48కి తగ్గింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement