జాతీయ లోక్ అదాలత్లో దాఖలు చేసిన తమ విడాకుల పిటిషన్ను ఉపసంహరించుకుని ఒక యువ జంట మళ్లీ ఒక్కటయ్యారు. ఏడాది క్రితం, మండ్య జిల్లాలోని కె. ఆర్. పేట తాలూకాలోని ముద్దనహళ్లి గ్రామానికి చెందిన హరీష్ మైసూరుకు చెందిన కవన విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఆదివారం లోక్ అదాలత్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు వారికి బుద్ధిమాటలు చెప్పారు. ‘జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న బాధలు, సమస్యల గురించి చింతించకుండా, పాలలో చక్కెర కలిసిపోయి రుచిని పెంచినట్లుగా, ఒకరిపై ఒకరు ప్రేమ, నమ్మకంతో జీవించాలి’ అని సీనియర్ జడ్జి సుధీర్ వివరించారు. కనువిప్పు కలిగిన ఆ యువ జంట రాజీపడి తిరిగి ఒక్కటి అవుతామని తెలిపారు. వెంటనే పూలదండలు తెప్పించి మార్పించారు. న్యాయవాదులు హొన్నెనహళ్లి హెచ్. వి. రవి, కామనహళ్లి బోరేగౌడ, వి. కె. స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.
- బెంగళూరు


