యానివర్సరీ గిఫ్ట్‌గా విడాకుల నోటీసులు: హీరోయిన్ | Celina Jaitly says divorce notice came as anniversary gift | Sakshi
Sakshi News home page

Celina Jaitly: 'పెళ్లి రోజు బహుమతిగా విడాకుల నోటీసులు'

Jul 5 2026 8:00 AM | Updated on Jul 5 2026 10:48 AM

Celina Jaitly says divorce notice came as anniversary gift

బాలీవుడ్ హీరోయిన్‌ సెలీనా జైట్లీ దాదాపు పదిహేనేళ్ల తర్వాత తిరిగి సినీ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. మంచు విష్ణు హీరోగా వి. సముద్ర దర్శకత్వం వహిస్తోన్నసూర్యం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. 2004లో వచ్చిన ఈ మూవీ తర్వాత సెలీనా తెలుగులో మరో సినిమా చేయలేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలు చేసింది. ఆమె హీరోయిన్‌గా నటించిన చివరి చిత్రం శ్రీమతి. ఉపేంద్ర హీరోగా నటించిన ఈ కన్నడ సినిమా 2011 జూలై 8న విడుదలైంది. అదే ఏడాది ఆమె పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయింది. అలా దాదాపు 15 ఏళ్ల పాటు వెండితెరకు దూరమైంది. తాజాగా బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. 

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సెలీనా.. తన పర్సనల్ లైఫ్, పెళ్లి జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. భర్త వేధింపులు, ఆర్థిక ఇబ్బందులతోనే తాను ఇండియాకు తిరిగి వచ్చానని తెలిపింది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కొద్దిమంది స్నేహితుల మద్దతుతో నా లైఫ్‌ తిరిగి ప్రారంభించానని చెప్పారు. ఆస్ట్రియాలో ఉన్నప్పుడే తన 15వ వివాహ వార్షికోత్సవానికి ముందు విడాకుల నోటీసులు వచ్చాయని తెలిపింది. ఆ నోటీసులు కూడా తాను చదవలేదని.. నా ఇద్దరు కవలలే చదివి వినిపించారని వెల్లడించింది. ఈ సందర్భంగా తన వైవాహిక సమస్యల గురించి మాట్లాడుతూ సెలీనా జైట్లీ కన్నీళ్లు పెట్టుకుంది. పెళ్లి రోజు గిఫ్ట్‌గా విడాకుల నోటీసులు పంపాడని తన బాధను వ్యక్తం చేసింది.

విడాకుల కేసు విచారణ సమయంలో కూడా వేధింపులు ఎదుర్కొన్నానని సెలీనా జైట్లీ తెలిపింది. ఆ సమయంలో నా బ్యాంకు ఖాతాలో చాలా తక్కువ డబ్బు ఉందని వెల్లడించింది. ఆర్థిక ఇబ్బందులతో ఒక పీడకలలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లు అనిపించిందని సెలీనా చెప్పుకొచ్చింది. పిల్లల శ్రేయస్సు దృష్ట్యా తాను స్నేహపూర్వకంగా విడిపోవడానికి అంగీకరించానని.. తన ఆస్తులు, తాను పెట్టుబడిగా పెట్టిన డబ్బు, పిల్లల ఉమ్మడి సంరక్షణ తప్ప మరేమీ తనకు అవసరం లేదని వెంటనే తన భర్త న్యాయవాదులకు ఒక అభ్యర్థన పంపానని తెలిపింది.

విడాకుల కేసు సమయంలో ఒంటరిగా పోరాటం చేయాల్సి వచ్చిందని వివరించింది. తన భర్త ఇంటి పై అంతస్తులో నివసిస్తుండగా.. నేను పిల్లలతో కలిసి మధ్య అంతస్తులో ఉండేదాన్ని అని తెలిపింది. పిల్లలకు వారి జీవితంలో స్థిరపడే వరకు కొంతకాలం అక్కడే నివసించడానికి అనుమతి కూడా కోరానని ఆమె చెప్పింది. కానీ పిల్లలతో అక్కడే ఉండాలంటే ఉద్యోగం చేయాలని ‍నాకు అర్థమైందని తెలిపింది. ఆ తర్వాత సూపర్‌మార్కెట్‌లో క్లీనర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని తనతో భర్త చెప్పిన విషయాన్ని కూడా ఆమె గుర్తు చేసుకుంది.

ఇండియాలోని తన ఆస్తులను విక్రయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడే పరిస్థితి మరింత దిగజారిందని తెలిపింది. దీంతో తాను అర్ధరాత్రి ఆస్ట్రియా నుండి తిరిగి వచ్చానని వెల్లడించింది. ఇల్లు లేకుండా భారతదేశానికి తిరిగి రావడం.. పది రోజుల పాటు హోటల్‌లో ఉంటూ తన జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రీతి జింటాతో పాటు ఇతర ఫ్రెండ్స్‌పై ఆధారపడ్డానని గుర్తు చేసుకుంది.

కాగా.. సెలీనా జైట్లీ 2010లో ఆస్ట్రియన్ వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ వివాహం చేసుకున్నారు. వీరికి 2012లో విన్‌స్టన్, విరాజ్ అనే కవలలు జన్మించారు. ఆ తర్వాత 2017లో ఆర్థర్ అనే మరో కుమారుడు జన్మించారు.  గతంలో ఓ కుమారుడు షంషేర్‌ గుండె సంబంధిత వ్యాధితో చనిపోయిందని తెలిపారు. 2025 నవంబర్‌లో గృహ హింస, భర్త వేధింపులకు తట్టుకోలేక  ముంబయిలోని అంధేరి మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement