భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఏఐ స్వీకరణలో సరికొత్త మైలురాయిని అందుకుంది. తమ సంస్థలోని దాదాపు 80,000 మంది ఉద్యోగులు ప్రస్తుతం క్లాడ్ కోడ్, కోడెక్స్ వంటి అత్యాధునిక ఏఐ కోడింగ్ అసిస్టెంట్లను రోజువారీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వర్క్ఫ్లోలో ఉపయోగిస్తున్నారని కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు. ఇటీవల జరిగిన త్రైమాసిక ఫలితాల విశ్లేషణ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
రాబడిలో 8.2 శాతం ఏఐ వాటా
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏఐ వినియోగాన్ని వేగవంతం చేసినట్లు వివరిస్తూ జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ సాధించిన మొత్తం రాబడిలో ఏఐ సేవల వాటానే 8.2 శాతానికి చేరిందని పరేఖ్ తెలిపారు. ఈ విభాగం గత కొన్ని త్రైమాసికాలుగా వరుసగా రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోంది. ముఖ్యంగా ఏఐ ఏజెంట్లు, ప్రాసెస్ ఆటోమేషన్, డేటా మోడర్నైజేషన్, ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ సహా ఆరు వ్యాపార విభాగాల్లో బలమైన డిమాండ్ కనిపిస్తోంది. ఈ క్లయింట్ అవసరాలను తీర్చేందుకు రాబోయే కొద్ది సంవత్సరాల్లో 6,000 మంది ‘ఫ్రంటియర్ ఇంజినీర్ల’ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
భద్రతతో కూడిన ప్లాట్ఫామ్
సంస్థల డేటా భద్రతను కాపాడుతూ ఏఐ సేవలను అందించేందుకు ఇన్ఫోసిస్ తన ‘టోపాజ్ ఫ్యాబ్రిక్’ ప్లాట్ఫామ్ను మరింత విస్తరిస్తోంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా క్లయింట్లు తమ డేటా సావర్నిటీకి భంగం వాటిల్లకుండా క్లౌడ్ ఆధారిత ఏ ఫౌండేషన్ మోడల్నైనా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా భారీ స్థాయిలో జెన్ ఏఐ ప్రయోగాలు చేసే సమయంలో కంపెనీలకు భారం కాకుండా ఏఐ టోకెన్ ఖర్చులను తగ్గించడంలో ఇది సాయపడుతోంది.
భవిష్యత్తు కార్యాచరణ
ప్రస్తుత స్థూల ఆర్థిక అనిశ్చితులు, క్లయింట్ సంబంధిత పరిణామాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరానికి స్థిర కరెన్సీ రాబడి అంచనాను 1.5-3% కి తగ్గించినప్పటికీ ఏఐ విభాగంలో ఇన్ఫోసిస్ దీర్ఘకాలిక భవిష్యత్తుపై ధీమాతో ఉంది. కంపెనీ వద్ద ఉన్న ఏఐ ప్రాజెక్టుల పైప్లైన్ ప్రస్తుతం లభిస్తున్న రాబడి కంటే ఎక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనం.
ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్


