ప్రభుత్వ రంగ ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ బంకులు.. ప్రీమియం పెట్రోల్ని ఇథనాల్ కలపకుండానే విక్రయించడాన్ని కొనసాగిస్తాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి స్పష్టం చేశారు. మొత్తం పెట్రోల్ విక్రయాల్లో ప్రీమియం వాటా 0.5 శాతమే ఉందని ఆయన చెప్పారు. అలాగే పెట్రోల్లో ఇథనాల్ని 20 శాతానికి మించి కలపడంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని వివరించారు.
ఈ0, ఈ10 పెట్రోల్ని తిరిగి ప్రవేశపెట్టే యోచనేదీ లేదని తెలిపారు. ఇథనాల్ కలపని పెట్రోల్ని ఈ0గా, 10 శాతం కలిపితే ఈ10గా, 20 శాతం కలిపితే ఈ20గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బంకుల్లోను ఈ20 పెట్రోల్ని విక్రయించాలని ఆదేశాలు ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటివరకు దీని ప్రతికూల ప్రభావాలపై రూఢీగా ఎటువంటి ఫిర్యాదులు రాలేదని ఆయన తెలిపారు. పరిశోధనల్లో, ఫీల్డ్ ట్రయల్స్లో కూడా ఇంజిన్ మన్నిక, పనితీరు, వాహన జీవితకాలంపై ఈ20 వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుందంటూ నిర్ధారణేమీ కాలేదని వివరించారు.
ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్


