ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్లో ఇథనాల్ కలపడం విషయంలో గత కొంతకాలంగా పెద్ద చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా E20 పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్ పనితీరు దెబ్బతింటుందా? అనే అనుమానాలు చాలా మంది వాహనదారుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలను స్పష్టం చేసింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) అందుబాటులో ఉంది. అయితే భవిష్యత్తులో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతం కంటే ఎక్కువ పెంచే ఆలోచనపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పెట్రోల్లో ఇథనాల్ శాతం పెంచాలంటే తొందరపడి నిర్ణయం తీసుకోబోమని, ముందుగా శాస్త్రీయ అధ్యయనాలు, సాంకేతిక పరిశీలనలు చేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ తెలిపారు. అంతే కాకుండా.. ఆటోమొబైల్ కంపెనీలు, చమురు సంస్థలు, పరిశోధనా సంస్థలతో చర్చించిన తర్వాతే భవిష్యత్ నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.
ఇకపోతే.. అసలు ఇథనాల్ను పెట్రోల్లో ఎందుకు కలుపుతున్నారు అనే విషయానికి వస్తే, దీనికి ప్రధాన కారణం కాలుష్యాన్ని తగ్గించడం, ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం. ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల.. రైతులు ఆర్థికంగా ఎదుగుతారు. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారవుతుంది కాబట్టి.
భారత్ ఇప్పటికే పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపాలనే లక్ష్యాన్ని చేరుకుంది. 2013-14లో కేవలం 1.5 శాతంగా ఉన్న ఇథనాల్ మిశ్రమం క్రమంగా పెరుగుతూ 2025-26 నాటికి 20 శాతానికి చేరుకుంది. భవిష్యత్తులో పెరుగుతుందా.. లేదా? అనేది తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఆగస్టు నుంచి.. మారనున్న మారుతి కార్ల ధరలు!


