కార్పొరేట్ ఉద్యోగాలనగానే వెంటనే గుర్తుకువచ్చేది ఒత్తిడి, నిరంతర లక్ష్యాల సాధన, ఫార్మల్ సమావేశాలు. కానీ, బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ కంపెనీ ‘నోబ్రోకర్’ కార్యాలయంలో ఇటీవల చోటుచేసుకున్న ఒక సంఘటన కార్పొరేట్ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. కంపెనీ సాధించిన అత్యుత్తమ త్రైమాసిక ఫలితాలను జరుపుకొనే క్రమంలో ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అమిత్ కుమార్ అగర్వాల్ ఏకంగా ఆఫీసు ఆవరణలోనే స్కూటీ నడుపుతూ హల్చల్ చేశారు.
ఉద్యోగులకు బహుమతి
నోబ్రోకర్ ప్రాపర్టీ అండ్ మూవర్స్ విభాగం ఊహించని రీతిలో రికార్డు స్థాయి ఫలితాలను నమోదు చేసింది. నెలల తరబడి జట్టుగా పనిచేసి, నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్న ఉద్యోగుల శ్రమను గుర్తించిన యాజమాన్యం, వారికి పారితోషికంగా పలు బహుమతులను ప్రకటించింది. అందులో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ద్విచక్రాహనాన్ని సీఈఓ స్వయంగా ఆఫీస్ ఫ్లోర్పై నడుపుకుంటూ వచ్చి విజేతలకు అందించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
🚨 A Bengaluru-based CEO of NoBroker, rides scooter inside office to celebrate company's 'amazing quarter.' pic.twitter.com/UFq5zhMPh8
— Indian Tech & Infra (@IndianTechGuide) July 23, 2026
ఈ దృశ్యాన్ని చూసి ఉద్యోగులు చప్పట్లు, కేరింతలతో ఆఫీసును హోరెత్తించారు. దీనికి సంబంధించిన వీడియోను అమిత్ కుమార్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకుంటూ ‘ఈ రోజు నాకో అత్యంత ముఖ్యమైన పని అప్పగించారు.. అదేంటంటే ఆఫీస్లో స్కూటర్ నడపడం!’ అని సరదాగా పేర్కొన్నారు. ‘కష్టపడి పని చేసే ఉద్యోగులకు ధన్యవాదాలు చెప్పడానికి ఫార్మల్ అవార్డు వేడుకల కంటే నాయకులే స్వయంగా వారి సంతోషంలో భాగస్వామి కావడం సరైన పద్ధతి’ అని అమిత్ కుమార్ అగర్వాల్ చెప్పారు.
ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్


