నీట్ పేపర్ లీకేజీపై జెన్ జీ చేస్తోన్న పోరాటంపై టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందించారు. మీ పోరాటానికి నా సెల్యూట్ అంటూ కొనియాడారు. నీట్ పేపర్ లీక్ కి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా.. నీట్ పేపర్ లీక్ వలన ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటివి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. ఏ ప్రభుత్వమైనా ఇవన్నీ అడక్కుండా చేయాల్సిన పనులని అన్నారు.
ఈ చిన్న డిమాండ్లు సాధించుకోడానికా లక్షల మంది పిల్లలు లాఠీ దెబ్బలు తిని రక్తమోడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిండీతిప్పలు మాని దెబ్బలకి ఓర్చుకుని, రాత్రనకా పగలనకా ఉద్యమిస్తున్నారని ప్రశంసించారు. పిల్లలు అకౌంటబిలిటీ అడుగుతున్నారు.. వారి ఆవేదనలో న్యాయం ఉందని తెలిపారు. ప్రభుత్వం వాళ్ల మాట వినాలి.. వాళ్లకి భరోసా ఇవ్వాలి. వాళ్ల స్ఫూర్తిని గెలిపించాలని శేఖర్ కమ్ముల కోరారు. మన పిల్లలు గెలిస్తే దేశం గెలిచినట్టు...మన పిల్లలు గెలిస్తే మనం బ్రతికినట్టు.. ప్రజలు గెలిస్తే ప్రభుత్వాలు గెలిచినట్టు.. అని సందేశమిచ్చారు. డియర్ జెన్ జీ.. మీరు చేస్తున్న ఈ పోరాటానికి చేతులెత్తి దణ్ణం పెడుతున్నా.. మీకు సెల్యూట్ చేస్తున్నా అంటూ ఫేస్ బుక్లో శేఖర్ కమ్ముల పోస్ట్ చేశారు.



