చిట్టెమ్మ ఇంటి ప్రధాన గేటును గునపంతో పగలగొట్టిస్తున్న సీఐ చిన్న గోవిందు
టీడీపీ నేతలకు అండగా నిలిచిన పాకాల సీఐపై ఎఫ్ఐఆర్
సివిల్ వివాదంలో జోక్యం ఫలితం 77 ఏళ్ల వృద్ధురాలి ఇంటిపై టీడీపీ వర్గీయుల దాడి
ఫిర్యాదులను పట్టించుకోని పోలీసులు
దీంతో పాకాల కోర్టును ఆశ్రయించిన బాధితురాలు
కోర్టు ఆదేశాలతో సీఐ, టీడీపీ మండల అధ్యక్షునితోసహా ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్
సాక్షి టాస్క్ ఫోర్స్ : సామాన్య ప్రజలకు అండగా నిలవాల్సిన పోలీసులు అధికార పార్టీకి అండగా నిలిస్తే.. కోర్టు దృష్టిలో నిందితులుగా నిలవాల్సి ఉంటుందన్న విషయం మరోసారి స్పష్టమైంది. ఆలస్యంగా వెలుగుచూసిన కథనం ప్రకారం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని పెద్దగోర్పాడుకు చెందిన 77 ఏళ్ల వృద్ధురాలు ఎస్.చిట్టెమ్మ తన భర్త ఎస్.క్రిష్ణమనాయుడు మరణించిన తరువాత గ్రామంలోని ఇంటి నెంబరు 12–24లో నివసిస్తున్నారు. ఆ ఇంటికి పైభాగంలో నివసించే క్రిష్ణమనాయుడు సోదరుడు సూరినేని శ్రీనివాసులు నాయుడుతో చిట్టెమ్మకు ఆ ఇంటికి సంబంధించిన సివిల్ వివాదం కోర్టులో నడుస్తోంది.
ఈ క్రమంలో చిట్టెమ్మ ఈ ఏడాది మార్చి 18న హైదరాబాద్లో నివసిస్తున్న తన కుమారుడు దగ్గరకు వెళ్లారు. ఈ సమయంలో శ్రీనివాసులు నాయుడు పాకాల సీఐ చిన్నగోవిందు యాదవ్ సహకారంతో తన సమీప బంధువులతో పాటు పాకాల మండల టీడీపీ అధ్యక్షుడు బోయపాటి నాగరాజనాయుడుతో కలిసి ఆ ఇంటి తాళం పగులగొట్టి అక్రమంగా లోపలికి ప్రవేశించారు. ఇంటి పరిసరాలను గునపాలతో ధ్వంసం చేశారు. ఈ దాడిలో రూ.3.10 లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లింది. దీనిపై వృద్ధురాలు మార్చి 19న పాకాల ఎస్హెచ్ఓగా ఉన్న సీఐ చిన్నగోవిందుకు ఫిర్యాదు చేశారు. ఆయన పట్టించుకోలేదు.
తిరుపతి జిల్లా ఎస్పీని కలసి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో ఆమె ఈ దారుణంపై పాకాల ఫస్ట్ క్లాస్ కోర్టును ఆశ్రయించారు. తన ఇంటి లోపలికి దౌర్జన్యంగా ప్రవేశించడం,వస్తువుల ధ్వంసం, అదే సమయంలో సీఐ చిన్న గోవిందు వారికి రక్షణగా నిలబడడం వంటి వీడియో దృశ్యాలను కోర్టుకు సమర్పించారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి చట్టాన్ని అతిక్రమించిన సీఐ చిన్నగోవిందు యాదవ్సహా 8మందిపై తక్షణం కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.


