ఈ పాపం ఎ‘వరి’ది బాబూ..! | Babu government has cheated the farmers | Sakshi
Sakshi News home page

ఈ పాపం ఎ‘వరి’ది బాబూ..!

Jul 25 2026 2:48 AM | Updated on Jul 25 2026 2:48 AM

Babu government has cheated the farmers

తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం నదురుబాద గ్రామంలో నీళ్లు లేక నెర్రెలిచ్చిన పొలం

డాంబికాలు పలికి.. చేతులెత్తేసి! 

రైతులను నిలువెల్లా దగా చేసిన బాబు సర్కారు  

కరువు ఛాయలున్నా ఖరీఫ్‌ ఆయకట్టుకు నీళ్లిస్తామని తొలుత ప్రగల్భాలు 

రాష్ట్రంలోని ప్రాజెక్టుల వారీగా క్యాలెండరూ విడుదల  

తీరా ఇప్పుడు చల్లగా చావుకబురు చెప్పిన సర్కారు  

డెల్టా కింద ఆయకట్టుకు నీరివ్వలేమని తేల్చిచెప్పిన ప్రభుత్వం 

ఇదేనా రియల్‌ టైం గవర్నెన్స్‌ అంటూ దుమ్మెత్తి పోస్తున్న రైతు సంఘాలు 

నష్టపోయిన రైతులకు ఏ బాబు పరిహారం చెల్లిస్తాడంటున్న రైతులు 

సాక్షి, అమరావతి : ఖరీఫ్‌–2026 సీజన్‌లో ప్రతీ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం తీరా ఇప్పుడు ఇవ్వలేమంటూ చావుకబురు చల్లగా చెప్పింది. మరీముఖ్యంగా కృష్ణ, గోదావరిడెల్టా కింద ఆయకట్టుకు ఇక నుంచి సాగునీరివ్వలేమని తెగేసిచెప్పింది. ప్రస్తుతం ఉన్ననీటి నిల్వలు తాగునీటి అవసరాలకు తప్ప సాగుకు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. దీంతో ఇదేనా చంద్రబాబు రియల్‌ టైం గవర్నెన్స్‌ అంటే అంటూ రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని నమ్ముకుని సాగుచేసిన రైతుల పరిస్థితి ఏమిటని, పెట్టిన పెట్టుబడుల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. సాగు నీరిస్తామన్న మీ భరోసాతో సాగు చేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయో లేదో చూసుకోకుండా
భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తాను అంతా ముందు ఊహిస్తానని..అందుకు తగినట్టుగానే ప్రణాళికలు రచిస్తానంటూ గొప్పలు చెప్పే విజనరీ చంద్రబాబు మాయ మాటలు నమ్మి రైతులు నిలువునా మోసపోయారు. మే 18న జరిగిన వ్యవసాయ, ఇరిగేషన్‌ సంయుక్త సమావేశంలో సాగునీటి విడుదల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏ ఆయకట్టుకు ఎప్పుడు నీరు విడుదల చేయబోతున్నామో ప్రాజెక్టుల వారీగా షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు.పైగా ప్రాజెక్టుల్లో సమృద్ధిగా నీళ్లున్నాయని, వాటర్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో చంద్రబాబును మించిన వారు లేరని గొప్పలు చెప్పారు.

బాబు మాటలు నమ్మి అటు గోదావరి, ఇటు కృష్ణా డెల్టా కింద 5.70 లక్షల ఎకరాల్లో రైతులు వరినాట్లు వేశారు. ఇతర పంటలన్నీ కలువుకుంటే ఈ రెండు డెల్టాల కింద మరో 3 లక్షల ఎకరాలకు పైగా పంటలు వేశారు. తీరా పంట ఎదకొచ్చే సమయంలో సాగునీరివ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. సాగునీటి ప్రాజెక్టుల్లో చాలినంత నీళ్లు లేవని, మరొక వైపు కరువు తీవ్రత తాము ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని రెండ్రోజుల క్రితం మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. అందుకే కృష్ణా డెల్టా పరిధిలో వరితో సహా ఏ ఒక్క పంటకు సాగు నీరివ్వలేమని తెగేసి చెప్పారు. 

వర్షాలు పడి, నీటి నిల్వలు పెరిగితే ఆరుతడి పంటలకు నీరు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. తాజాగా ఇరిగేషన్‌ శాఖ ఈఎన్‌సీ కే.నరసింహమూర్తి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కృష్ణా డెల్టా పరిధిలో వరి సాగు చేయొద్దని సూచించారు. ఇప్పుడున్న నీటి నిల్వలు తాగునీటి అవసరాలకు తప్ప సాగునీటి అవసరాలకు మళ్లించలేమని కరాఖండిగా చెప్పేశారు. దీంతో ఇప్పటివరకు పెట్టుబడి పెట్టిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.ఇప్పటికే ఎకరాకు రూ.15వేలకుపైగా పెట్టుబడి పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. నమ్మించి తమను నట్టేట ముంచేసిందని మండిపడుతున్నారు. 

ప్రభుత్వం ఇచ్చిన హామీ వలనే తాము సాగు చేశామని, పెట్టుబడి పెట్టి నష్టపోయామని రైతులు వాపోతున్నారు. తక్షణమే పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయో లేదో చూసుకోకుండా ఏ విధంగా సాగునీటి షెడ్యూల్‌ ప్రకటించారని ప్రశ్నిస్తున్నారు. వంశధార నుంచి పెన్నా వరకు నీటి విడుదల పేరిట చేసిన హంగామా ఎందుకని నిలదీస్తున్నారు. ఇదేనా రియల్‌ టైం గవర్నెన్స్‌ అంటూ మండిపడుతున్నారు. రెండేళ్లుగా సాగు వేళ సకాలంలో సాగు నీటితో పాటు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందక నానా అగచాట్లు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement