- బాబు పాలనలో తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం
- కూటమి పాలనలో కుదేలైన అన్నదాతలు
- వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజం
తాడేపల్లి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసిందని, సాగునీరు అందక రాష్ట్రంలో రైతాంగం తీవ్ర వంచనకు గురైందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... జూలై 1వ తేదీన ప్రకాశం బ్యారేజీ వద్ద ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చేత ఖరీఫ్కు సాగునీరు విడుదల చేయించి, తీరా 24 రోజుల తర్వాత కృష్ణా డెల్టాకు వరి సాగుకు నీళ్లు ఇవ్వలేమని మంత్రుల చేత ప్రకటించడం ఘోరమైన దగా అని మండిపడ్డారు.
కలెక్టర్ మాటలు నమ్మి కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలోని 23 నుంచి 25 లక్షల ఎకరాల్లో ఎకరాకు రూ. 15,000 చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులు నిలువునా మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ముందస్తు ప్రణాళికా రాహిత్యం వల్ల రైతాంగానికి జరిగిన రూ. 3,750 కోట్ల నష్టాన్ని తక్షణమే ప్రభుత్వమే చెల్లించాలని మరియు ఈ మోసానికి బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పాలని సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..
ముఖ్యమంత్రి ఆదేశాలతోనే రైతులను ముంచే నిర్ణయాలు
ఈ రాష్ట్రంలో రైతన్నలకు, వ్యవసాయ రంగానికి మేలు జరిగితే చూసి ఆనందించే మొదటి వ్యక్తి వైఎస్.జగన్ మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు ప్రభుత్వం తన నిజరూపాన్ని చూపిస్తోంది. నిన్నటి క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులు వెల్లడించిన నిర్ణయాలు రైతులను పీడించేలా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియకుండా, ఆయన ఆదేశాలు లేకుండా ఏ ఒక్క మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టరు. కాబట్టి రైతులను ముంచే ఈ నిర్ణయాలన్నీ చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే జరిగాయి.
జూలై 1న నీళ్లు వదిలి.. జూలై 24న ఇవ్వలేమనడం ఘోర వంచన
ఖరీఫ్ సీజన్కు కృష్ణా డెల్టా పరిధిలోని 13 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తున్నామని, 30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని స్వయంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జూలై 1వ తేదీన ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లు ఎత్తి అధికారికంగా ప్రకటించారు. కలెక్టర్ మాటలు నమ్మిన కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలోని సుమారు 23 నుంచి 25 లక్షల ఎకరాల ఆయకట్టు రైతులు సాంప్రదాయబద్ధంగా ఏరువాక సాగిస్తూ వ్యవసాయం మొదలుపెట్టారు.నాట్లు వేసేందుకు ఎకరాకు సగటున రూ. 15,000 వరకు పెట్టుబడి పెట్టారు.
తీరా 24 రోజులు గడిచాక, నిన్నటి మంత్రివర్గ సమావేశం తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి పార్థసారథి వచ్చి కృష్ణా డెల్టాకు వరి పంటకు నీళ్లు ఇవ్వలేమని, కేవలం తాగునీటికి మరియు ఆరుతడి పంటలకు మాత్రమే వాడుకోవాలని చెప్పడం రైతుల వెన్ను విరిచడమే. కలెక్టర్ ప్రకటన ఆధారంగా ఇప్పటికే 70 శాతం మంది రైతులు నాట్లు వేశారని మంత్రి ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు నీళ్లు ఇవ్వలేమని చెబితే, రైతులు పెట్టిన రూ. 3,750 కోట్ల పెట్టుబడి నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు?"
డెల్టా ఆయకట్టు సంక్షోభం
• ప్రభావిత ఆయకట్టు : 23 నుండి 25 లక్షల ఎకరాలు (కృష్ణా, గోదావరి)
• నాట్లు వేసిన విస్తీర్ణం : 70% (ప్రభుత్వ సమాచారం ప్రకారం)
• ఎకరాకు సగటు పెట్టుబడి : రూ. 15,000
• రైతాంగానికి జరిగిన నష్టం: రూ. 3,750 కోట్లు
విజనరీ చంద్రబాబుకు వర్షాభావం ముందు తెలియదా?
అన్ని విద్యలు నాకే తెలుసని, ఐటీ రంగాన్ని, టెన్నిస్, బ్యాడ్మింటన్ క్రీడాకారులను నేనే తయారు చేశానని, రష్యా కూలింగ్ టెక్నాలజీ నుంచి ఇస్రో సాంకేతికత వరకు నాకే తెలుసని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈ సీజన్లో వర్షాభావం ఉంటుందని ముందుగా అంచనా వేసే సోయి లేదా? మే, ఏప్రిల్ మాసాల్లోనే వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించి ఏ పంటలు వేయాలో, ఏవి వేయకూడదో రైతులకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?
సీలేరు ప్రాజెక్టుల నీటిని సమర్థవంతంగా నిర్వహించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. చంద్రబాబుకు కేవలం సంపదను ఎలా కొల్లగొట్టాలి, ఇసుక, మట్టిని తన ఎమ్మెల్యేలతో ఎలా దోచుకోవాలనే శ్రద్ధ ఉంది తప్ప రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనే ధ్యాస లేదు.
వైఎస్సార్సీపీ హయాంలో గిట్టుబాటు ధరలు
వైఎస్.జగన్ పాలనలో విప్లవాత్మకమైన ఆర్బికే (RBK) వ్యవస్థను తెచ్చి, విపత్తులు వస్తే ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి, ప్రతీ పంట చివరి గింజ వరకు గిట్టుబాటు ధర కల్పించాం. ధైర్యంగా కాలర్ ఎగరేసి మా పాలన గురించి చెప్పుకోగలము. కూటమి ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే మేము ఇచ్చిన మద్దతు ధరల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చామని నిరూపించగలరా? అని ప్రశ్నించారు.
ఉచిత సిలిండర్ల హామీలో తీవ్ర దగా..
ఎన్నికల ముందు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, ముందస్తుగానే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ఈనాడు పత్రిక సాక్షిగా ప్రకటనలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి 13 నెలలు దాటినా ఇప్పటివరకు తొమ్మిది సిలిండర్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రెండింటితో సరిపెట్టారు. ఇప్పుడు ప్రతి 4 నెలలకోసారి బుక్ చేసుకున్నాక డబ్బులు ఇస్తామని నిబంధనలు మారుస్తూ విచిత్రమైన నాటకాలు ఆడుతున్నారు. సూపర్ సిక్స్ హామీలన్నీ గాలికి కొట్టుకుపోయాయి.
ఉత్తరాంధ్ర దోపిడీ – ప్రాజెక్టుల నిలిపివేత
ఉత్తరాంధ్ర అభివృద్ధి అని డప్పు కొట్టుకునే కూటమి ప్రభుత్వం, విశాఖపట్నంలో రూ. 30 వేల కోట్ల విలువైన భూములను తమ బంధువులకు కట్టబెట్టే పనిలో పడింది. మా హయాంలో ప్రారంభించిన పాడేరు, విజయనగరం మెడికల్ కాలేజీలను సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. పార్వతీపురం, నర్సీపట్నం మెడికల్ కాలేజీలు, కురుపం ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ పనులను నిలిపివేశారు. ఉద్ధానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను నిర్వీర్యం చేస్తున్నారు. అలాగే వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చాలన్న నిబంధనలను పక్కనపెట్టడంతో నిర్వాసితులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ నేపధ్యంలో తీవ్ర సంక్షోభంలో ఉన్న రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కంటితుడుపు చర్యలు మాని, నష్టపోయిన ప్రతీ రైతుకూ ఎకరాకు రూ. 15,000 చొప్పున మొత్తం రూ. 3,750 కోట్ల పరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. అదేవిధంగా, రద్దయిన 'సున్నా వడ్డీ పంట రుణాలు' పథకాన్ని పునరుద్ధరించి, అన్ని పంటలకూ మద్దతు ధర కల్పిస్తూ సిండికేట్ దోపిడీని అరికట్టాలని లేని పక్షంలో రైతులకు న్యాయం జరిగే వరకు, వారి హక్కుల సాధన కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోరాటాల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటుందని హెచ్చరించారు.


