రంగనాథ్‌ కస్టడీకి ఆదేశించేవాళ్లమే.. | Telangana High Court Fires on HYDRA Commissioner conduct | Sakshi
Sakshi News home page

రంగనాథ్‌ కస్టడీకి ఆదేశించేవాళ్లమే..

Jul 25 2026 4:28 AM | Updated on Jul 25 2026 4:28 AM

Telangana High Court Fires on HYDRA Commissioner conduct

ఏజీ విజ్ఞప్తితో సంయమనం పాటిస్తున్నామన్న హైకోర్టు 

హైడ్రా కమిషనర్‌ తీరుపై మరోసారి తీవ్ర ఆగ్రహం 

వివాదాస్పద స్థలంలోకి అడుగుపెట్టవద్దని ఆదేశం 

అఫిడవిట్‌ దాఖలుకు ఆదేశం.. విచారణ 27కు వాయిదా

2016లో దాఖలైన రిట్‌ పిటిషన్‌ మొదలు రిట్‌ అప్పీల్, సివిల్‌ సూట్, సీసీసీఏ, మొదటి ధిక్కార కేసు వరకు హైడ్రా కమిషనర్‌ ఎక్కడా పార్టీ కాదు. రెండో ధిక్కార కేసు నుంచి అకస్మాత్తుగా ప్రత్యక్షమై కోర్టు ఉత్తర్వుల అమల్లో జోక్యం చేసుకున్నారు. ఏ కేసులోనూ పార్టీగా లేని ఒక అధికారి అకస్మాత్తుగా అన్ని అధికారాలూ తనవే అన్నట్లుగా వ్యవహరించారు. కోర్టు ఆదేశాల అమలుకు అడ్డుపడటం ఆక్షేపణీయం. ఇలాంటి తీరు ఎప్పుడూ చూడలేదు, వినలేదు. హైడ్రా అధికారులు చట్టానికి అతీతులు కాదు. వారి ధిక్కరణలను ఉపేక్షిస్తే ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం దెబ్బతింటుంది. అలాంటి పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం.     – హైకోర్టు  

సాక్షి, హైదరాబాద్‌: ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను కస్టడీకి తీసుకొనేలా ఆదేశాలు జారీ చేయాలని భావించామని.. కానీ అడ్వొకేట్‌ జనరల్‌ ఎ. సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తిని గౌర విస్తూ సంబంధిత అధికారిని మూడోసారి కూడా అదుపులోకి తీసుకోకుండా సంయమనం పాటిస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయడంతోపాటు ఇకపై వివాదాస్పద స్థలంలోకి ఆయన, హైడ్రా అధికారులు అడుగుపెట్టబోమని హామీ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే జూలై 18న ఆ స్థలంలోకి ఎందుకు ప్రవేశించారో వివరించాలని పేర్కొంది.

కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే కాకుండా ధిక్కార కేసులో సరైన అఫిడవిట్‌ కూడా దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. శాంతా శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌పై జస్టిస్‌ అనిల్‌ కుమార్‌ జూకంటి ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్‌ చర్యలను తీవ్రంగా తప్పుబట్టింది.

అడ్వొకేట్‌ జనరల్‌ ఎ. సుదర్శన్‌రెడ్డి విచారణకు హాజరై వివరణ ఇవ్వడంతోపాటు హైడ్రా కమిషనర్‌ను అదుపులోకి తీసుకోవద్దని చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని సంయమనం పాటిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. గురువారం వివాదాస్పద స్థలం రక్షణకు సైన్యాన్ని మోహరించాలని ఇచి్చన ఆదేశాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు, శుక్రవారం ఇచ్చిన తాజా ఆదేశాలే అమల్లో ఉంటాయని వెల్లడించారు.  

హైడ్రానే ప్రభుత్వం అయ్యిందా? 
హైడ్రాను ఆశ్రయిస్తున్న ఇతర ప్రభుత్వ శాఖల తీరుపైనా న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖ, జీహెచ్‌ఎంసీ తదితర శాఖలకు వేర్వేరు చట్టాలున్నా అందరూ హైడ్రానే ఎందుకు ఆశ్రయిస్తున్నారు? ఆ శాఖలన్నీ పనికిరాని సంస్థలుగా మారిపోయాయా?’అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఒకే ఒక్క ప్రభుత్వ ఉత్తర్వు ఆధారంగా అన్ని శాఖలను పక్కనపెట్టి ప్రతి అంశంలోనూ హైడ్రా జోక్యం చేసుకోవడం ఎలా సాధ్యమన్నారు. హైడ్రా కమిషనర్‌.. ఒక చట్టంలా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే ఒకసారి ధిక్కారానికి గురైనప్పటికీ కోర్టు ఆదేశాలను రంగనాథ్‌ పాటించట్లేదని.. ఇలాంటి చర్యలను వదిలేస్తే న్యాయపాలన వ్యవస్థే దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. లోతుకుంటలోని 40 ఎకరాల భూమిలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని అఫిడవిట్‌లో పేర్కొనడమే కాకుండా తర్వాత మరింత వివరణాత్మక కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేస్తామని పేర్కొనడం ఆశ్చర్యకరమన్నారు. ధిక్కార చర్యలు స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకా వివరణాత్మక అదనపు కౌంటర్‌ అఫిడవిట్‌ అంటే ఏమిటో అర్థం కావట్లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 

ఇంత పోలీసు బలగం ఎందుకు? 
హైడ్రా ప్రతి చర్యకు భారీ పోలీసు బలగాన్ని వెంట తీసుకెళ్లడంపై కూడా న్యాయమూర్తి ప్రశ్నలు సంధించారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా ఎందుకు వ్యవహరిస్తున్నారు?. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా లేక వారిని భయబ్రాంతులకు గురిచేసేందుకా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. నగరంలో వందల చెరువులున్నా.. హైడ్రా చర్యలు మాత్రం ఎంపిక చేసుకున్న కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నాయని.. ఇది ఎందుకో కమిషనర్‌కే తెలియాలన్నారు. ఇది పూర్తి వివక్షకు తావిచ్చేలా ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అఫిడవిట్‌ వేయాలంటూ విచారణ వాయిదా వేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement