రోడ్డు భద్రతకు ప్రత్యేక బ్యూరో | CM Revanth Reviews Traffic Safety Measures: Telangana | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రతకు ప్రత్యేక బ్యూరో

Jul 25 2026 12:48 AM | Updated on Jul 25 2026 12:48 AM

CM Revanth Reviews Traffic Safety Measures: Telangana

ట్రాఫిక్‌ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షించేలా సంస్థాగత నిర్మాణం

రెండు లేదా మూడు నెలలకోసారి ట్రాఫిక్‌ క్రమబద్ధికరణపై సమీక్ష  

స్మార్ట్‌ సిగ్నలింగ్‌ విధానంపై సమగ్రంగా అధ్యయనం 

డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలి  

అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ట్రాఫిక్‌ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక బ్యూరోను ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రవాణా వ్యవస్థను సమగ్రంగా అధ్యయనం చేసి ట్రాఫిక్‌ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసే ఈ బ్యూరోకు సంస్థాగత నిర్మాణం ఉండాలని సూచించారు. ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ఈ అంశంపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణతో పాటు మాదక ద్రవ్యాల నిరోధం, భద్రత కమిటీల ఏర్పాటుపై ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. 

ప్రతి రెండు లేదా మూడు నెలలకోసారి ట్రాఫిక్‌ క్రమబద్ధికరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించాలని చెప్పారు. ట్రాఫిక్‌ వ్యవస్థలో నిబంధనలకన్నా క్రమబద్ధికరణపై ఎక్కువగా దృష్టి సారించాలని, వాతావరణంలో వచ్చే మార్పులు, కార్యాలయాల పనివేళలు, రద్దీ సమయాలు, స్థానిక సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ముందే ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు అవసరమైన అధ్యయనం జరగాలని చెప్పారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు పటిష్టం చేయాలని, ఓఆర్‌ఆర్‌పై ఇష్టానుసారం వాహనాలు నిలపకుండా నిరంతర పర్యవేక్షణ జరగాలని ఆదేశించారు. 

హైదరాబాద్‌లో స్మార్ట్‌ సిగ్నలింగ్‌! 
హైదరాబాద్‌ నగరంలో స్మార్ట్‌ సిగ్నలింగ్‌ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సిగ్నల్‌ ఫ్రీ వ్యవస్థను తీసుకురావడానికి అవసరమైన చోట్ల అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్‌ కారిడార్‌లను నిర్మించాలని, సాధ్యమైనంత వరకు సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్‌ నిలిచిపోకుండా వాహనాల రాకపోకలు నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని సూచించారు. 

డ్రగ్స్‌పై విద్యా సంస్థలకు బాధ్యత అప్పగించాలి 
‘డ్రగ్స్‌ నిరోధంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలి. విద్యా సంస్థల్లో డ్రగ్స్‌ నియంత్రణకు సంబంధించి సంస్థల యాజమాన్యాలను బాధ్యుల్ని చేయాలి. క్యాంపస్‌ లోపల డ్రగ్స్‌కు సంబంధించి ఏ ఘటనకైనా యాజమాన్యాలనే బాధ్యుల్ని చేయాలి. క్యాంపస్‌ బయట జరిగే కార్యకలాపాలు గుర్తించి సమాచారాన్ని అందించే వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి. విద్యాసంస్థలకు అధికారంతో పాటు బాధ్యతను అప్పగించాలి. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకునేలా చూడాలి..’అని సీఎం చెప్పారు.  

సమాచారం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 
‘డ్రగ్స్‌కు సంబంధించి సమాచారం అందించేందుకు విద్యాసంస్థల ఆవరణలో టోల్‌ ఫ్రీ నంబర్, ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి. డ్రగ్స్‌ను గుర్తించడం, మాని్పంచడం, శిక్షించడం అన్న మూడు దశలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. డ్రగ్స్‌ స్వీకరించి పట్టుబడితే డీ అడిక్షన్‌ సెంటర్‌కు తరలించాలి. తరచూ పట్టుబడితే కఠినంగా శిక్షించే అంశాన్ని పరిశీలించండి. డ్రగ్స్‌ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు అవసరమైతే చట్టాన్ని రూపొందించే అంశంపై అధ్యయనం చేయండి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్‌రెడ్డి, కె.రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement