సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్లో పోలీసులు చేపట్టిన మెగా కార్డన్ సెర్చ్లో భారీగా వాహనాలు సీజ్ అయ్యాయి. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో గంజాయి విక్రయాలు, దొంగిలించిన వాహనాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో విశ్వసనీయ సమాచారంతో పోలీసులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్డన్ సెర్చ్లో ఇళ్లు, గల్లీలు, ఖాళీ స్థలాలు, అనుమానాస్పద ప్రాంతాలు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను గుర్తించారు. సంబంధిత వాహనాలను కలిగి ఉన్న వారిపై కేసులు నమోదు చేసి, మొత్తం 57 వాహనాలను సీజ్ చేశారు.
అయితే సీజ్ చేసిన వాహనాలు దొంగతనాలకు సంబంధించినవేనా..? ఇతర జిల్లాల్లో నమోదైన కేసులతో వాటికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. వాహనాల చాసిస్, ఇంజిన్ నంబర్ల ఆధారంగా వాటి అసలు యజమానులను గుర్తించే ప్రక్రియ కూడా చేపట్టినట్లు సమాచారం.
అయితే పోలీసులు అకస్మాత్తుగా ఈ డ్రైవ్ చేపట్టడం స్థానికంగా కలకలం రేపింది. నేర కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్కు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.


