మరిది వేసిన మాస్టర్‌ప్లాన్‌! కథ అడ్డం తిరిగింది.. | Attempted Murder Conspiracy Case In Metpalli Jagtial District Karimnagar | Sakshi
Sakshi News home page

మరిది వేసిన మాస్టర్‌ప్లాన్‌! కథ అడ్డం తిరిగింది..

Jul 25 2026 12:26 PM | Updated on Jul 25 2026 12:48 PM

Attempted Murder Conspiracy Case In Metpalli Jagtial District Karimnagar

వదిన హత్యకు సుపారి

స్వాధీనం చేసుకున్న పిస్టల్‌, బుల్లెట్లు

పోలీసుల విచారణతో కుట్ర బట్టబయలు

కటకటాల్లోకి కుట్రదారులు

వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాములు

కరీంనగర్‌, జగిత్యాల: వదినను చంపి ఆస్తి దక్కించుకోవాలన్న పథకాన్ని పోలీసులు ఛేదించారు. హత్యకు ప్రణాళిక రచించిన మరిది, అతని భార్య, సమీప బంధువులను ఇప్పటికే రిమాండ్‌కు తరలించగా.. తాజాగా మరో నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌వర్మను అరెస్ట్‌ చేశారు. మెట్‌పల్లి సర్కిల్‌ ఆఫీస్‌లో డీఎస్పీ రాములు శుక్రవారం వివరాలు వెల్లడించారు.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన గోనెల శంకర్‌, రాజం అన్నదమ్ములు. పొత్తుల ఉన్న 58 గుంటల భూమిని శంకర్‌ తన అన్నకు తెలియకుండా విక్రయించడమే కాకుండా పొత్తులో ఉన్న ఇంటిని సైతం తన పేరిట రిజి స్ట్రేషన్‌ చేయించుకోవడం ఇరు కుటుంబాల మధ్య గొడవలకు దారితీసింది. ఈక్రమంలోనే రెండు సార్లు శంకర్‌ తన అన్నవదినలు రాజం, లక్ష్మిలపై దాడి చేయగా కేసులు నమోదయ్యాయి. ఆస్తిని దక్కించుకునేందుకు తన వదిన గోనెల లక్ష్మిని హత్య చేయాలని భార్య అనూష, బంధువు ముత్తన్నలతో కలిసి పథకం రచించాడు.

తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సచిన్‌వర్మను సంప్రదించి డబ్బు ఆశ చూపాడు. దీనికి ఒప్పుకున్న సచిన్‌ గత మార్చిలో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి అపరిచిత సాధువు వద్ద నాటు పిస్టల్‌, మూడు బుల్లెట్లు కొనుగోలు చేశాడు. దీని కోసం శంకర్‌ రూ.35వేలు ఫోన్‌పే ద్వారా సచిన్‌కు పంపించాడు. సచిన్‌వర్మ మెట్‌పల్లికి తిరిగి వచ్చిన తర్వాత గత నెల 13న లక్ష్మిని చంపడానికి వారి ఇంటికి వెళ్లిన సచిన్‌ భయాందోళనకు గురై కాల్పులు జరపకుండా వెళ్లిపోయాడు.

తిరిగి 15న అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురి ప్రోద్బలంతో సచిన్‌ బైక్‌పై వెళ్లి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న లక్ష్మిపై కాల్పులు జరిపాడు. అయితే గురితప్పడంతో బుల్లెట్‌ ఎడమ చెంప భాగంలో తగిలింది. కాల్పులతో భారీ శబ్దం రావడం, లక్ష్మి కేకలు వేయడంతో సచిన్‌ పరారయ్యాడు. ఆ తర్వాత నిందితులు ఈ ఘటనను గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

సచిన్‌ను ఉత్తరప్రదేశ్‌కు పంపించి కేసులో ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి మరుసటి రోజు శంకర్‌, ముత్తన్న.. 28న అనూషలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలికి శస్త్ర చికిత్స చేసిన తర్వాత బుల్లెట్‌ బయటకు రావడంతో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. పలు కోణాల్లో విచారించిన పోలీసులు ఈనెల 20న ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి సచిన్‌ను అదుపులోకి తీసుకొని.. పిస్టల్‌, రెండు బుల్లెట్స్‌, బైక్‌, ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ సురేశ్‌బాబు, ఎస్సై కిరణ్‌కుమార్‌, సిబ్బందిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement