కోరుట్ల ఎస్సై చిరంజీవి సస్పెండ్‌ | Korutla SI Chiranjeevi Suspended | Sakshi
Sakshi News home page

కోరుట్ల ఎస్సై చిరంజీవి సస్పెండ్‌

Jul 25 2026 12:07 PM | Updated on Jul 25 2026 12:10 PM

Korutla SI Chiranjeevi Suspended

కోరుట్ల: ఓ సారి మహిళపై దాడి.. మరో వారం రోజుల వ్యవధిలో అదే మహిళ దారుణ హత్య. ఈ హాత్యోదంతంలో విధుల నిర్వహణలో కనిపించిన నిర్లక్ష్యం. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో దళిత మహిళ దారుణంగా హత్యకు గురికావడంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సీరియస్‌గా తీసుకున్నారు. ఫలితంగా కోరుట్ల ఎస్సై చిరంజీవిని సస్పెండ్‌ చేస్తూ జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 

నిర్లక్ష్యం.. ప్రాణాంతకం
కోరుట్ల పట్టణానికి చెందిన కాసుల గంగారెడ్డితో కొంతకాలంగా కర్రె సునీత అనే మహిళ సహాజీవనం చేస్తోంది. ఈ వ్యవహారం కాసుల గంగారెడ్డి కుమారుడు కాసుల వంశీకి కంటగింపుగా మరడంతో జూన్‌ 19న కాసుల వంశీ కోరుట్లలోని రాంనగర్‌ ఏరియాలో నివాసముంటున్న కర్రె సునీత ఇంటికి వెళ్లి కర్రలతో దాడి చేశాడు. కర్రె సునీత చేయి విరగడంతో  ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నట్లు సమాచారం. 

అనంతరం సునీత తల్లి కోరుట్ల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో పోలీసులకు సమాచారం అందగా ఎస్సై చిరంజీవి సునీత తల్లి ఫిర్యాదు మేరకు కాసుల గంగారెడ్డి అతడి కుమారుడు కాసుల వంశీలను పిలిపించుకున్నట్లు సమాచారం. ఈక్రమంలో కాసుల గంగారెడ్డి తనతో సహజీవనం చేస్తున్న కర్రె సునీతతో మాట్లాడి రాజీ కుదుర్చుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. అనంతరం కర్రె సునీతను కాసుల గంగారెడ్డి మెట్‌పల్లిలో నివాసముంచాడు. దాడి సంఘటన జరిగిన 22 రోజులకు ఈనెల12న వంశీ మెట్‌పల్లికి వెళ్లి కత్తితో కర్రె సునీతపై దాడి చేసి హతమార్చాడు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయంగా మారింది. దాడి జరిగిన సమయంలోనే కాసుల వంశీపై కేసు నమోదు చేసి రిమాండ్‌ చేస్తే కర్రె సునీత హత్య జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మంత్రి సీరియస్‌!
నాలుగు రోజుల క్రితం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మెట్‌పల్లి మండలం చింతలపేటలో కర్రె సునీత ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సమయంలో కొంతమంది దళిత సంఘాల నాయకులు కర్రె సునీతపై మొదట దాడి జరిగిందని ఆ సమయంలో ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో నిందితుడు బరితెగించి హత్య చేశాడని ఆరోపించారు. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌ సీరియస్‌ అయి చర్యలకు ఆదేశించినట్లు సమాచారం. ఈక్రమంలోనే ఎస్సై చిరంజీవిని సస్పెండ్‌ చేస్తూ  ఎస్పీ అశోక్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారని తెలిసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement