హైదరాబాద్: బంజారాహిల్స్లోని కాసు బ్రహ్మనందరెడ్డి (కేబీఆర్) జాతీయ ఉద్యానవనం చుట్టూ ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణానికి సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు ఈ నెల 27న విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం శుక్రవారం నగరానికి వచ్చింది. కేబీఆర్ పార్కులో అటవీ, జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమైంది. అలాగే ఈ బృందం స్వయంగా పార్కు పరిసరాల్లో పర్యటించి వివరాలు తెలుసుకుంది.
కేబీఆర్ పార్కు చుట్టూ చెట్ల తొలగింపును నిలిపివేయాలని, పార్కు పర్యావరణ సమతుల్యతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా..ఎకో సెన్సిటివ్ జోన్లో 25 మీటర్ల మేర ఎలాంటి చెట్లు కొట్టవద్దంటూ ఈ ప్రక్రియపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ఈ నెల 27న మరోసారి విచారణ చేపట్టనుంది. ఈ విచారణలో రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత శాఖలు చేపడుతున్న అభివృద్ధి పనులు, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలుసమర్పించనున్నారు.
ఎకో సెన్సిటివ్ జోన్లో 25–30 మీటర్ల దూరంలో చెట్లు ఎన్ని ఉన్నాయి, కొట్టివేశారా..? తదితర అంశాలను కేంద్రబృందం పరిశీలించింది. ఎంపవర్డ్ కమిటీ మెంబర్ అంజన్ మొహంతితో పాటు మరో అధికారి ఢిల్లీ నుంచి వచ్చి కేబీఆర్ పార్కులో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, అటవీ శాఖ అధికారిణి ప్రియాంక వర్గీస్, హెచ్–సిటీ ఖైరతాబాద్ జోన్ సీఈ రత్నాకర్, ఈఈ సంపద, డీఈ హరీష్, ఏఈ ప్రశాంత్లతో సమావేశమయ్యారు. సమీక్షలో చర్చించిన అంశాలు, పరిశీలించిన అంశాలతో ఓ నివేదికను ఈ బృందం సుప్రీంకోర్టులో తమ వాదనల్లో వినిపించనుంది.


