33 ఏళ్ల వయసులో... స్వప్నం సాకారం | Saransh Jain selected for Indian team | Sakshi
Sakshi News home page

33 ఏళ్ల వయసులో... స్వప్నం సాకారం

Jul 29 2026 4:20 AM | Updated on Jul 29 2026 4:20 AM

Saransh Jain selected for Indian team

భారత జట్టుకు ఎంపికైన సారాంశ్‌ జైన్‌ 

తండ్రి శిక్షణలో రాటుదేలిన ఆల్‌రౌండర్‌

శ్రీలంకతో సిరీస్‌లో అరంగేట్రం చేసే అవకాశం  

ఐపీఎల్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో మెరిస్తే చాలు... భారత జట్టులో చోటు ఖాయమే అని యువత భావిస్తున్న ప్రస్తుత తరుణంలో... ఓ ఆటగాడు దశాబ్ద కాలంగా టీమిండియా పిలుపు కోసం ఎదురు చూశాడంటే నమ్మగలరా! అప్పుడెప్పుడో పుష్కర కాలం క్రితం ఆడిన తొలి రంజీ మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టి అదుర్స్‌ అనిపించుకున్న ఆ ప్లేయర్‌కు 12 ఏళ్ల తర్వాత భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.

దేశవాళీల్లో నిలకడగా రాణించినప్పటికీ... టీమిండియాలో ఉన్న పోటీ, జట్టు కూర్పు కారణంగా అవకాశం దక్కించుకోలేకపోయిన మధ్యప్రదేశ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ సారాంశ్‌ జైన్‌... ఎట్టకేలకు 33 ఏళ్ల వయసులో భారత జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన నేపథ్యంలో సారాంశ్‌ ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే...  – సాక్షి, క్రీడావిభాగం

ధనాధన్‌ క్రికెట్‌ క్రేజ్‌లోనూ... సుదీర్ఘ ఫార్మాట్‌కే అధిక ప్రాధాన్యత ఇచ్చిన సారాంశ్‌ జైన్‌ నిరీక్షణ ఫలించింది. బ్యాట్‌ చేత పట్టినప్పటి నుంచి కన్న కల... ఇన్నాళ్ల తర్వాత నిజమైంది. 33 ఏళ్ల వయసులో ఈ ఆఫ్‌స్పిన్నర్‌ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ప్రస్తుత పోటీ క్రికెట్‌లో 33 ఏళ్ల వయసు అంటే కెరీర్‌ చరమాంకానికి వచ్చేసినట్లే! అలాంటిది ఈ వయసులో అతడు తొలిసారి భారత జట్టుకు ఎంపికవడం ఆశ్చర్యమే. అయితే ఇన్నాళ్లలో ఎన్నోసార్లు సెలక్టర్ల దృష్టికి వచ్చినా... వేర్వేరు కారణాల వల్ల టీమిండియాకు ఎంపిక కాలేకపోయిన ఈ మధ్యప్రదేశ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.

సుదీర్ఘ కాలగా రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా జాతీయ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండటంతో ఇతర స్పిన్నర్లకు పెద్దగా అవకాశాలు రాకపోగా... ఇప్పుడు వాషింగ్టన్‌ సుందర్‌ గాయంతో లంక పర్యటనకు దూరమవడంతో సారాంశ్‌ను ఎంపిక చేశారు. కుడిచేతి వాటం ఆఫ్‌స్పిన్నర్‌ అయిన ఈ మధ్యప్రదేశ్‌ ప్లేయర్‌... లోయర్‌ ఆర్డర్‌లో ఎడంచేతి వాటం బ్యాటింగ్‌తోనూ ఆకట్టుకోగలడు. సుదీర్ఘ కాలంగా మధ్యప్రదేశ్‌ రంజీ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న సారాంశ్‌... 2022లో ఆ జట్టు చాంపియన్‌గా నిలవడంతో ప్రధానపాత్ర పోషించాడు. ఇతర ఆటగాళ్లంతా ఐపీఎల్‌ వంటి అతిపెద్ద లీగ్‌పై దృష్టి పెడుతున్న సమయంలోనూ సారాంశ్‌... దేశవాళీలకే తొలి ప్రాధాన్యతనిచ్చి తన ప్రత్యేకత చాటుకున్నాడు. అతడి కఠోర శ్రమ, అకుంఠిత దీక్షకు ఇప్పుడు ఫలితం దక్కినట్లయింది.  

ఆశ్విన్‌ అభిమాని...
చిన్నప్పటి నుంచి తండ్రి వద్దే కోచింగ్‌ తీసుకున్న సారాంశ్‌... ఆ తర్వాత భారత మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను అభిమానించడం ప్రారంభించాడు. అశ్విన్‌ వీడియోలను పరిశీలిస్తూ బౌలింగ్‌లో వైవిధ్యం పెంపొందించుకునేందుకు  ప్రయత్నిస్తుంటాడు. జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం వస్తే... ‘ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడు’ అని తండ్రి చెప్పిన మాటలను పాటించేందుకు సారాంశ్‌ సిద్ధమవుతున్నాడు. 

‘నేను మధ్యప్రదేశ్‌ తరఫున రంజీ ట్రోఫీలో ఆడాను. అయితే అందరు ఆటగాళ్లలాగే దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కల నెరవేర్చుకోలేకపోయాను. కానీ ఇప్పుడు ఇన్నాళ్లకు నా కుమారుడికి ఆ అవకాశం వచ్చింది. సారాంశ్‌తో పాటు ఎంతో మంది రంజీ ప్లేయర్లకు నేను ప్రత్యేక శిక్షణ ఇచ్చా. వాళ్లందరిలో ఒక ప్రత్యేకత ఉంది. నా దగ్గర ట్రయినింగ్‌ పొందిన వాళ్లంతా తక్కువ మాట్లాడుతారు, ఎక్కువ కష్టపడతారు’ అని సుబోధ్‌ వివరించారు. మరి 33 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు ఎంపికైన సారాంశ్‌ అరంగేట్రం అవకాశం వస్తే అదరగొట్టాలని మనమూ ఆశిద్దాం!

క్యాన్సర్‌ను దాచిపెట్టి...
2014లో సారాంశ్‌ ఇండోర్‌ క్లబ్‌ తరఫున ఆస్ట్రేలియాలో మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో సుబోధ్‌ క్యాన్సన్‌ బారిన పడ్డారు. మ్యాచ్‌ అనంతరం తండ్రితో మాట్లాడాలనుకున్న ప్రతిసారీ బిజీగా ఉన్నారనే సమాధానం దక్కేది. అయితే పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత తండ్రికి నోటి క్యాన్సర్‌ వచ్చిందనే వార్త సారాంశ్‌కు తెలిసింది. దీంతో అతడు పూర్తిగా నీరుగారిపోయాడు. ‘అప్పుడు నా నోరు బాగా వాచిపోయింది. దాంతో మాట్లాడే పరిస్థితుల్లో లేను. 

ఒక చిన్న చీటీ తీసుకొని నువ్వు మెరుగైన ప్రదర్శన చేస్తే నేను త్వరగా కోలుకుంటా (బేటా, తూ జిత్నా అచ్ఛా కరేగా... మై ఉత్నీ జల్దీ ఠీక్‌ హో జావుంగా) అని రాసిచ్చా. దాన్ని సారాంశ్‌ తూచా తప్పకుండా పాటించాడు. బరిలోకి దిగిన ప్రతిసారీ 100 శాతం కష్ట పడుతూ మెరుగైన ఫలితాలు సాధించాడు. మంగళవారం భారత జట్టు ప్రకటన సమయంలో అతడు ఆలయానికి వెళ్లాడు. గుడి నుంచి బయటకు రాగానే జాతీయ జట్టుకు ఎంపికైన విషయం తెలిసి చాలా సంతోషించాడు. సుదీర్ఘ కాలంగా అతడు పడ్డ శ్రమకు ఇన్నాళ్లకు ఫలితం దక్కింది’ అని సారాంశ్‌ తండ్రి సుబోధ్‌ తెలిపారు.

తండ్రి కూడా రంజీ ప్లేయర్‌...
సారాంశ్‌ తండ్రి సుబోధ్‌ జైన్‌ రంజీ ప్లేయర్‌. మధ్యప్రదేశ్‌ జట్టు తరఫున 9 రంజీ మ్యాచ్‌లాడిన సుబోధ్‌ 23 వికెట్లు పడగొట్టారు. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో స్పిన్నర్ల మధ్య విపరీతమైన పోటీ కారణంగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకున్న ఆయన కల నెరవేరలేదు. తాను సాధించలేకపోయింది... తన కుమారుడైనా సాధించాలని సుబోధ్‌ ఎంతో తపించారు. సారాంశ్‌కు చిన్నప్పటి నుంచే సుబోధ్‌ కఠిన శిక్షణ ఇచ్చారు. 

‘మాటల కన్నా చేతలు మిన్న’ అని బలంగా నమ్మే సుబోద్‌... తన కుమారుడిని కూడా అదే విధంగా తీర్చిదిద్దారు. సారాంశ్‌కు పన్నెండేళ్లు వచ్చేసరికి అతడిలో ఏదో ప్రత్యేకత ఉందని సుబోధ్‌ గుర్తించారు. దీంతో అతడిని మరింత సానబెట్టి రంజీ స్థాయికి చేర్చారు. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు రెండు టైటిల్స్‌ అందించిన రజత్‌ పాటీదార్‌తో కలిసి సుదీర్ఘ కాలం ఆడిన సారాంశ్‌ జైన్‌... పరిమిత ఓవర్ల కంటే సుదీర్ఘ ఫార్మాట్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement