టీమిండియా జెర్సీని కాషాయం రంగులోకి మార్చడంపై మాజీ కెప్టెన్‌ ఫైర్‌ | What is logic of orange, Former hockey captain Rasquinha slams new India jersey | Sakshi
Sakshi News home page

టీమిండియా జెర్సీని కాషాయం రంగులోకి మార్చడంపై మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Jul 30 2026 12:58 PM | Updated on Jul 30 2026 1:02 PM

What is logic of orange, Former hockey captain Rasquinha slams new India jersey

భారత హాకీ జట్టు కొత్త జెర్సీ రంగుపై మాజీ కెప్టెన్, ఒలింపియన్ వీరెన్ రస్క్విన్హా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత హాకీ జట్టు గుర్తింపు, వారసత్వం ఎప్పుడూ నీలం (బ్లూ) రంగుతోనే ముడిపడి ఉందని, అలాంటప్పుడు ఆరెంజ్ జెర్సీని తీసుకురావడం వెనుక ఉన్న కారణమేంటని ప్రశ్నించారు.

ఎఫ్‌ఐహెచ్ పురుషులు, మహిళల హాకీ ప్రపంచకప్‌లకు ముందు హాకీ ఇండియా భారత జట్ల కోసం కొత్త ఆరెంజ్ జెర్సీని ఆవిష్కరించింది. దీనిపై స్పందించిన రస్క్విన్హా, భారత హాకీ అభివృద్ధికి హాకీ ఇండియా ఎన్నో మంచి పనులు చేసినా, జాతీయ జట్టు తొలి జెర్సీ రంగును మార్చడం మాత్రం నిరాశ కలిగించిందన్నారు.

"భారత జట్టు గుర్తింపు, వారసత్వం ఎప్పుడూ బ్లూ జెర్సీతోనే ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు ఆ నీలిరంగు జెర్సీ ధరించి గర్వపడ్డాను. అభిమానులు కూడా భారత జట్టును బ్లూ జెర్సీలోనే చూడాలని కోరుకుంటారు. మరి ఆరెంజ్ జెర్సీ వెనుక లాజిక్ ఏంటి..?"** అని ఆయన సోషల్ మీడియాలో ప్రశ్నించారు.

తన వ్యాఖ్యలకు రాజకీయ రంగు పులుముతున్నారని పేర్కొన్న రస్క్విన్హా, తన ఉద్దేశం పూర్తిగా జట్టు సంప్రదాయం, గుర్తింపు గురించి మాత్రమేనని స్పష్టం చేశారు. "హాకీలో భారత్‌కు ఉన్న స్థానం, ఫుట్‌బాల్‌లో అర్జెంటీనాకు ఉన్న స్థానం లాంటిదే. అర్జెంటీనా తన సంప్రదాయ నీలం-తెలుపు చారల జెర్సీని వదిలి ఆరెంజ్ రంగు జెర్సీ ధరిస్తుందా..?" అని ఉదాహరణ ఇచ్చారు.

మరోవైపు, కొత్త జెర్సీ రూపకల్పన వెనుక భావనను హాకీ ఇండియా వివరించింది. కాషాయ రంగు ధైర్యం, త్యాగం, విజయానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపింది. జెర్సీపై మండల నమూనాలు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయని, అశోక చక్రం స్ఫూర్తితో రూపొందించిన నేవీ బ్లూ డిజైన్ శాంతి, పురోగతి, ఏకాగ్రతను సూచిస్తుందని పేర్కొంది. సుదర్శన చక్రం స్ఫూర్తితో రూపొందించిన ఛాతీ భాగంలోని డిజైన్ బలం, ఐక్యత, పురోగమనానికి చిహ్నమని వివరించింది.

కాగా, ఆగస్టు 14 నుంచి బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరిగే పురుషుల హాకీ ప్రపంచకప్‌లో భారత్ పూల్-డి‌లో ఇంగ్లండ్, వేల్స్, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. మహిళల జట్టు ఆగస్టు 16న చైనాతో తమ ప్రపంచకప్‌ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement