ఎన్యూమరేషన్ ఫారాల జిరాక్సులు తీసుకుంటున్న టీడీపీ వ్యక్తి
సర్ ఎన్యూమరేషన్ ఫారాల జిరాక్సుల సేకరణపై ఆందోళన
జిరాక్సులు తీసుకుంటున్న టీడీపీ వ్యక్తిని అడ్డుకున్న వైఎస్సార్సీపీ నేతలు
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో దొంగ ఓట్ల సృష్టికి టీడీపీ నేతలు కుతంత్రం పన్నుతున్నారనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ నేతలు.. ఇతర నియోజకవర్గాల వ్యక్తులను ఇంటింటికీ పంపి ఓటర్ల నుంచి సమగ్ర ఓటర్ సర్వే(సర్) ఎన్యూమరేషన్ ఫారాల జిరాక్సులను సేకరించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలోని బూత్ నంబర్ 70, 71 పరిధిలో శనివారం ఉరవకొండ మండలానికి చెందిన ఓ టీడీపీ వ్యక్తి ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల జిరాక్సులు ఇవ్వాలని కోరాడు.
మీరేవరని ఓటర్లు ప్రశ్నిస్తే తొలుత బీఎల్వోనని, గతంలో పనిచేస్తున్న బీఎల్వో సరిగా పనిచేయనందున తనను పంపారని సమాధానమిచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు వైఎస్సార్సీపీ బీఎల్ఏలకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరిస్తున్న వ్యక్తిని అడ్డుకున్నారు. బీఎల్వో అయితే ఐడీ కార్డు చూపాలని కోరారు. తడబడిన ఆ వ్యక్తి సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలాడు. అనంతరం సమస్య పెద్దదవుతుందని గుర్తించి స్థానిక టీడీపీ నేత డిష్ మురళి తనను పంపించాడని నిజం చెప్పాడు.
దీంతో వైఎస్సార్సీపీ నాయకులు, బీఎల్ఏలు డిష్ మురళిని నిలదీయగా ‘మా వాళ్లే వదిలిపెట్టండి’ అని చెప్పడం గమనార్హం. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కనుసన్నల్లోనే ఈ తతంగం సాగుతోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఫొటోలు మార్చి ఆన్లైన్లో దొంగ ఓట్లు సృష్టించేందుకే ఎన్యూమరేషన్ ఫారాల జిరాక్సులు తీసుకెళ్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య డిమాండ్ చేశారు.


