న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదంగా మారిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) అమలుకు ఏడాది పూర్తయ్యింది. దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, ఎన్నికల కమిషన్కు మధ్య తీవ్ర వివాదం రేపిన ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు కనీసం 6 కోట్ల ఓటర్ల పేర్లు తొలగింపునకు గురయ్యాయి. ఓటరు జాబితా ప్రక్షాళన ప్రస్తుతం దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతోంది.
గతేడాది జూన్ 24వ తేదీన బిహార్లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ పైలట్ ప్రాజెక్టుగా సర్ను చేపట్టింది. సర్ పూర్తయ్యే సరికి అక్కడ 65 లక్షల పేర్లు ఓటరు జాబితా నుంచి తీసివేశారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు గగ్గోలుపెట్టాయి. అర్హులైన ఓటర్ల పేర్లను ధ్రువీకరణ పత్రాలు లేవనే సాకుతో బీజేపీకి అనుకూలంగా ఈసీ తొలగిస్తోందంటూ ఆరోపించాయి. వివిధ అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలుమార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో సర్ చేపట్టే అధికారం ఈసీకి ఉందని స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగింది.


