జనంపై ‘సర్‌’ బుల్డోజర్‌ | Mamata Banerjee argues in Supreme Court Over SIR | Sakshi
Sakshi News home page

జనంపై ‘సర్‌’ బుల్డోజర్‌

Feb 5 2026 5:11 AM | Updated on Feb 5 2026 5:11 AM

Mamata Banerjee argues in Supreme Court Over SIR

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిరసిస్తూ నేరుగా సుప్రీంకోర్టులో మమత వాదన

వాదనకు 5 నిమిషాలడిగితే 15 నిమిషాలిచ్చిన కోర్టు

ప్రతి సమస్యకు పరిష్కారముంటుందని సీజేఐ వ్యాఖ్య

విచారణ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) సర్వే సక్రమంగా జరగట్లేదని, పనిఒత్తిడితో బూత్‌ లెవల్‌ అధికారులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని, బాధితులను ఢిల్లీకి తీసుకొచ్చి బెంగాల్‌ అంశాన్ని హస్తిన వేదికగా చర్చనీయాంశంగా మార్చిన పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఈ అంశంపై నేరుగా సర్వోన్నత న్యాయస్థానంలో తన వాదనలు స్వయంగా వినిపించారు. 

ఐదు నిమిషాలు సమయం ఇస్తే సూటిగా, స్పష్టంగా తమ వాదనలను విన్పిస్తానని మమత కోరగా ధర్మాసనం ఏకంగా 15 నిమిషాల సమయం కేటాయించడం విశేషం. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా స్వయంగా ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో రాష్ట్ర కేసును వాదిస్తుండటంతో ఆమె వాగ్ధాటిని వినేందుకు న్యాయవాదులు సీజేఐ కోర్టురూమ్‌లోకి ఎగబడ్డారు. ఈ ఘటనకు సర్వోన్నత న్యాయస్థానం వేదికైంది. 

ఈసీ ఒక వాట్సాప్‌ కమిషన్‌..
తమ రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ చేపట్టడాన్ని సవాల్‌ చేస్తూ మమతా బెనర్జీ, మొస్తారీ బానూ, టీఎంసీ ఎంపీలు డెరెక్‌ ఓబ్రియాన్, దోలాసేన్‌లు వేసిన పిటిషన్‌పై తానే స్వయంగా వాదనలు విన్పించేదుకు అనుమతించాలంటూ ఇప్పటికే మమత ఇంటులాక్యుటరీ పిటిషన్‌ వేశారు. దీంతో మమతను వాదనలకు కోర్టు అనుమతించింది. మమత తన వాదనల సందర్భంగా ఎన్నికల కమిషన్‌ను వాట్సాప్‌ కమిషన్‌గా అభివర్ణించారు.

 ‘‘ ఈసీ ఒక వాట్సాప్‌ కమిషన్‌. ఉన్నతాధికారులకు కీలక నిర్ణయాలను వాట్సాప్‌లలో పంపిస్తోంది. మా రాష్ట్రంలో అక్ర మంగా జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో కోర్టు జోక్యం చేసుకోవాలి. ఎన్నికల నేపథ్యంలోనే మా రాష్ట్రాన్ని ఈసీ లక్ష్యంగా చేసుకుంది. ఓటర్లపై ఈసీ ‘ఎస్‌ఐఆర్‌’ బుల్డోజర్‌తో తొక్కిస్తోంది. ఎస్‌ఐఆర్‌ పేరిట బూత్‌ లెవల్‌ అధికారులను ఈసీ అధికా రాలు వేధిస్తున్నారు. వేధింపులు, పని ఒత్తిడితో పెద్దసంఖ్యలో బీఎల్‌ఓలు ఆత్మహత్యచేసుకున్నారు. 

రాష్టంలో ప్రజాస్వామ్యాన్ని మీరే కాపాడాలి. ఈ కేసులో న్యాయం కోసం మొదట్నుంచీ మా లాయర్లు శతథా పోరాడుతున్నారు. అయినాసరే మాకు ఎక్కడా న్యాయం దక్కట్లేదు. నేను కూడా కట్టుబానిసను. సాధారణ కుటుంబం నుంచి వచ్చా. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం పోరాడట్లేను. రాష్ట్ర ఓటర్ల ఓటింగ్‌ హక్కుల కోసం పోరాడుతున్నా. ఇదే విషయమై ఇప్పటికే ఆరు సార్లు ప్రధాన ఎన్నికల కమిషన్‌ వద్ద మొరపెట్టుకుంటూ లేఖలు రాశా. అయినాసరే ఎలాంటి స్పందన రాలేదు. స్పెల్లింగ్‌లో చిన్నచిన్న తప్పులను ఎత్తిచూపి కోట్లాది ఓట్లను తొలగించొద్దు. ఇతర డాక్యుమెంట్లు అడక్కుండా ఎస్‌ఐఆర్‌ వెరిఫికేషన్‌లో ఆధార్‌కార్డ్‌ను గుర్తింపుకార్డుగా అంగీకరించండి’’ అని మమత కోరారు.

 దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ విపుల్‌ ఎం పంఛోలీల ధర్మాసనం స్పందించింది. ‘‘మీరు చేస్తున్న వాదనల్లో నిజం ఉంది. అయితే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది’’ అని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఫిబ్రవరి 9వ తేదీ(సోమవారం)కల్లా మీ స్పందన తెలపాలని ఎలక్షన్‌ కమిషన్‌కు, పశ్చిమబెంగాల్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారికి నోటీసులు జారీచేసింది. బీఎల్‌ఓలు, ఎలక్టోరల్‌ రోల్‌ ఆఫీసర్‌లతో సున్నితంగా వ్యవహ రించాలని, వాళ్లకు నోటీసులు జారీచేసే ముందు ఆలోచించాలని ఈసీకి ధర్మాసనం సూచించింది. కేసు విచారణ సోమవా రానికి వాయిదా వేశారు.

ఎందుకింత తొందర?
‘‘ఎస్‌ఐఆర్‌ సర్వేను సమగ్రంగా, సంపూర్ణంగా చేయాలంటే కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. కానీ హడావుడి గా కేవలం మూడునెలల్లో ముగించాలని ఎందుకు నిర్ణయించారు? ఇదే సమయంలో రాష్ట్రంలో పండగ సీజన్‌ ఉంది. పంటల సాగు నడుస్తోంది. అంతా బిజీగా ఉండే సమయంలో హడావిడిగా ఎస్‌ఐఆర్‌ ముగించాలని ఎందుకు భావిస్తున్నారు?’’ అని మమత వాదించారు. వేధింపులతో బీఎల్‌ఓలు చనిపోతున్నారని మమత వాదించగా ఎలక్షన్‌ కమిషన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది కలగజేసుకుని ‘‘ ఉద్దేశపూర్వకంగా మమత సర్కార్‌ తక్కువ పనితనం ఉన్న 80 మంది గ్రేడ్‌–2 అధికారులను మాకు సహాయకులుగా అందించింది’’ అని వాదించారు. దీనిపై మమత మాట్లాడారు. 

‘‘ ఈసీ నిబంధనల్లో పేర్కొన్న మేరకే తగు రాష్ట్ర ఆఫీసర్లను ఈసీ కోసం కేటాయించాం’’ అని బదులిచ్చారు. మళ్లీ ద్వివేది మాట్లాడబోగా మమత చేతులు జోడించి ‘‘ జడ్జిగారు దయచేసి మమ్మల్ని పూర్తిగా మాట్లాడనివ్వండి’’ అని వేడుకున్నారు. దీంతో సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ ‘‘మమత ఇంతదూరం వచ్చిందే మాట్లాడేందుకు. అయినా నిజమైన ఓటరు పేరు ఖచ్చితంగా ఓటర్లజాబితా తుది లిస్ట్‌లో ఉండాల్సిందే. తుది జాబితా నుంచి ఏ ఒక్క అమాయకుడిని పేరు తొలగింపునకు గురికావొద్దు’’ అని అన్నారు. ఇంగ్లిష్‌ స్పెల్లింగ్‌లో తప్పులుంటే కూడా నోటీస్‌లు ఇస్తున్నారని శ్యామ్‌ దివాన్‌ వాదించగా కోర్టు ‘‘ఇంగ్లిష్‌ అంటేనే స్పెల్లింగ్‌ తప్పులమయం’’ అని ఒక బెంగాళీ సామెతను గుర్తుచేశారు. తెలుపురంగు చీర, నలుపు రంగు శాలువా ధరించి న్యాయవాదులు, పార్టీ ఎంపీ, సీనియర్‌ న్యాయవాది కల్యాణ్‌ బెనర్జీలతో వచ్చిన మమతను చూసేందుకు సుప్రీంకోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, పలు కేసుల పిటిషనర్లు ఎగబడ్డారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement