ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం తేవాలని ప్రయత్నించారు
సోనమ్ వాంగ్చుక్పై సుప్రీంలో కేంద్రం వాదన
న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని కేంద్రం ఆరోపించింది. పొరుగునున్న నేపాల్, బంగ్లాదేశ్లలో మాదిరిగా జెన్ జెడ్ నిరసనలకు పిలుపునిచ్చారని పేర్కొంది. తన నిజ స్వరూపం బయటపడకుండా ఉండేందుకు గాను ఆయన మహాత్మాగాంధీ ప్రసంగాలను ఉపయోగించుకున్నారని తెలిపింది.
జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద వాంగ్చుక్ను నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో వేసిన పిటిషన్పై సోమవారం జస్టిస్ అరవింద్ కమార్, జస్టిస్ పీవీ వరాలేల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్ఎస్ఏ కింద అరెస్ట్ చేసిన వ్యక్తులను ఎలాంటి విచారణ లేకుండా గరిష్టంగా 12 నెలలపాటు నిర్బంధించే హక్కు అధికారులకు ఉంటుంది. కేంద్రం, లద్దాక్ యంత్రాంగం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
కేంద్రాన్ని వాళ్లు అని, లద్దాఖ్ ప్రజలను మనం అని వేరుగా చూపిస్తూ మాట్లాడారని వాంగ్చుక్ ప్రసంగించే వారని ఆయన పేర్కొన్నారు. గతంలో జమ్మూ కశీ్మర్లో వచ్చినట్లుగా ప్రజాభిప్రాయ సేకరణ, రెఫరెండం చేపట్టాలంటూ డిమాండ్ చేశారన్నారు. చైనా, పాకిస్తాన్లతో సరిహద్దులు కలిగిన లద్దాఖ్ ప్రాంతం అత్యంత సున్నితమైందన్న మెహతా..అక్కడి ప్రజలను ఉద్దేశిస్తూ వాంగ్చుక్ చేసిన ప్రసంగాలను తప్పనిసరిగా గణనలోకి తీసుకోవాలని కోరారు.
‘ప్రసంగాల వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాతే జిల్లా మేజిస్ట్రేట్ వాంగ్చుక్ నిర్బంధానికి ఆదేశాలు జారీ చేశారు. మేజి్రస్టేట్ ఆదేశాల మేరకు డీఐజీ స్థాయి అధికారి ముందుగా వాంగ్చుక్ వద్దకు వెళ్లి ఆయన ప్రసంగాల వీడియోలను, ఇతర ఆధారాలను చూపారు. నిర్బంధంలోకి తీసుకునేందుకు గల కారణాలను వివరించారు’అని ధర్మాసనానికి మెహతా తెలిపారు.
మేజి్రస్టేట్ కృత్రిమ ఆధారాలతోనే వాంగ్చుక్ను నిర్బంధించాలంటూ ఆదేశాలు జారీ చేశారన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. వాంగ్చుక్ చేసిన ప్రసంగాలను విన్న అధికారులు, ఆ వీడియోలను తయారు చేసి మేజి్రస్టేట్ ముందుంచారని వివరించారు. మంగళవారం కూడా ఈ కేసులో వాదనలు కొనసాగనున్నాయి. జోథ్పూర్ సెంట్రల్ జైలులో ఉన్న వాంగ్చుక్ అరబ్ దేశాల్లో మాదిరిగా తిరుగుబాటును లేవదీసేందుకు ప్రయత్నించినట్లు తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ జనవరి 29వ తేదీన ఒక ప్రకటన వెలువరించారు.
ప్రభుత్వాన్ని విమర్శించే, నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కు తనకుందని అందులో పేర్కొన్నారు. కొన్ని ఎంపిక చేసిన వీడియోలను చూపు తూ అధికారులు వాంగ్చుక్ నిర్బంధాన్ని సమరి్థంచుకుంటున్నారంటూ ఆయన తరఫు లాయర్ కపిల్ సిబాల్ వాదిస్తున్నారు. వాంగ్చుక్ నిర్బంధం చట్ట విరుద్ధం, ఏకపక్ష చర్య..ఆయన ప్రాథమిక హక్కులకు భంగకరమని గీతాంజలి అంగ్మో ఆరోపిస్తున్నారు. లద్దాఖ్ కు రాష్ట్ర హోదా ప్రకటించాలంటూ గతేడాది సెప్టెంబర్లో జరిగిన నిరసనల్లో నలుగురు చనిపోగా, 90 మంది వరకు గాయపడ్డారు. అల్లర్లకు వాంగ్చుక్ రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని ఆరోపిస్తూ రెండు రోజుల తర్వాత అధికారులు జాతీయ భద్రతా చట్టం కింద ఆయన్ను నిర్బంధంలోకి తీసుకోవడం తెల్సిందే.


