బందోబస్తుగా వచ్చిన పోలీసులతో మమతా బెనర్జీ వాగ్వాదం
బెంగాల్లో ఎస్ఐఆర్ పేరిట కుటుంబాలను వేధిస్తున్నారని మమత మండిపాటు
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే పేరిట అధికారులు తమ రాష్ట్రంలో కుటుంబాలను వేధిస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే విషయమై ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన మమత సోమవారం బంగభవన్ వద్ద బందోబస్తు కోసం వచ్చిన ఢిల్లీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రాష్ట్ర ఓటర్ల సమస్యలను ఈసీ ముందు ఏకరవు పెట్టేందుకు వచ్చిన తనను ధర్నా చేస్తాననే ఉద్దేశంతో అడ్డుకోవడం ఏమాత్రం సబబుగా లేదంటూ ఆమె ఢిల్లీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో పోలీసులను మొహరించారు. తర్వాత అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులతో మమత ఘటన వివరాలను వెల్లడించారు.
బెంగాల్లో ఎస్ఐఆర్ బాధితులుగా మిగిలిపోయిన వారిలో దాదాపు 50 కుటుంబాలను మమత ఢిల్లీకి తరలించారు. కొందరు చాణక్యపురిలోని రాష్ట్ర ప్రభుత్వ భవనం అయిన బంగ భవన్లో, మరికొందరి వేర్వేరు చోట్ల విడిది ఏర్పాటుచేశారు. వీళ్లను కలిసేందుకు మమత బంగభవన్కు చేరుకోగానే అక్కడ మొహరించిన భారీ బందోబస్తును చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘‘బెంగాల్లో ఎస్ఐఆర్ బాధిత కుటుంబాలు మీడియాతో మాట్లాడకూడదా? వాళ్ల గోడు వెళ్లబోసుకోవద్దా?’’అని పోలీసులను మమత నిలదీశారు. ‘‘బంగభవన్కు పోలీసులొచ్చి బాధిత కుటుంబాలను బెదిరించారు. మా కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఎలక్షన్ కమిషన్తో మాకు సమావేశముంది. అధికారికంగా అపాయింట్మెంట్ తీసుకున్నాకే ఇక్కడికొచ్చాం. ఎస్ఐఆర్ వేధింపులకు బెంగాల్లో చాలా మంది చనిపోయారు. వాళ్ల కుటుంబాలు మీడియాతో మాట్లాడకూడదా?’’అని పోలీసులను మమత నిలదీశారు.
అప్పుడెక్కడికి పోయారు?
‘‘బెంగాల్ కుటుంబాలు బసచేసిన ప్రతి చోటుకు పోలీసులు ఎందుకొస్తున్నారు? ఇప్పుడొచ్చిన ఇదే పోలీసులు ఎర్రకోటవద్ద బాంబు పేలినప్పుడు ఎక్కడికి పోయారు?. క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులను నేను తప్పుబట్టంలేదు. పోలీస్బాస్లను నిలదీస్తున్నా. మీకు దమ్ములేదు. దేశాన్ని రక్షించే సత్తా లేదు. బెంగాలీలు, జనాన్ని పీడించడమే మీకు తెలుసు. ఎస్ఐఆర్ పేరిట అరాచకాలకు పాల్పడుతున్నారు.
ఢిల్లీకి నేనొస్తే వీళ్లకు భయం పట్టుకుంటోంది. నేనేమైనా లక్షల మందిని వెంటేసుకొచ్చానా?. పేదలకు ఢిల్లీలో స్థలం లేదా? ఢిల్లీ జమీందారీలా తయారైంది. నేనేమీ ఇక్కడకు వీళ్లతో కలిసి ధర్నా చేపట్టేందుకు రాలేదు. మేమంతా న్యాయంకోసం ఇక్కడికొచ్చాం’’అని మమత అన్నారు. ఢిల్లీ పోలీసుల ప్రశ్నల పరంపర నుంచి కుటుంబాలను రక్షించేందుకు వాళ్లు ఉంటున్న ప్రాంతాలకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సాకేత్ గోఖలే, దోలా సేన్, కకోలీ ఘోష్ దస్తీదార్, బాపీ దల్దార్లు వెళ్లారు.
ఢిల్లీ కైలాశ్ కాలనీలోని పశ్చిమబెంగాల్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గెస్ట్హౌస్లో ఉన్న 20 మందికి రక్షణగా సాకేత్ గోఖలే వెళ్లగా అక్కడికి చేరుకున్న పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. హేలీ రోడ్లోని బంగభవన్కు చేరుకున్న బాధితులతో తర్వాత మమత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ భేటీ అయి వాళ్ల సమస్యలను అడిగి తెల్సుకున్నారు. తర్వాత వాళ్లను వెంటబెట్టుకుని మమత ఈసీ కార్యాలయానికి వెళ్లారు.


