లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల స్థిర,చర ఆస్తులు అంటే ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించే వాహనాలు ఇతర ఆస్తులతో స్థిరాస్తులైన ఇళ్లు, స్థలాల వివరాలను అందించాలని సూచించారు.
ఇందుకోసం మానవ్ సంపద (Manav Sampada) పేరుతో ఓ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,66,261 ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. డిసెంబర్ 31,2025 నుంచి జనవరి 31,2026 వరకు వారి ఆస్తుల వివరాల్ని పోర్టల్లో పొందుపరచాలని ఆదేశించారు. నిర్ధేశించిన గడువు లోపు ఆస్తుల వివరాలు అందించాలని, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చీఫ్ సెక్రటరీ ఎస్పీ గోయల్ పర్యవేక్షించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం యోగి ఆధిత్యనాథ్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు తమ తమ ఆస్తులు ఇవేనంటూ సంబంధిత ఆస్తుల వివరాల్ని మానవ్ సంపద్ పోర్టల్లో ఆధాలతో సహా అప్లోడ్ చేశారు. వారిలో 68వేల మంది ఉద్యోగులు వారి వివరాల్ని ఇవ్వలేదు.
ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూపీ సీఎం వారి జనవరి జీతాల్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల ఆస్తుల వివరాలు ఇచ్చే వరకు జీతాలు ఇవ్వకూడదని సంబంధిత శాఖ అధికారులకు స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రమోషన్ల నిలిపివేయడం, వారిపై పెనాల్టీ విధిస్తామని హుకుం జారీ చేశారు.


