మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్‌ వీడియో వైరల్‌ | 4 Years Live In Marrying Another agra Woman self destruction | Sakshi
Sakshi News home page

మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్‌ వీడియో వైరల్‌

Mar 13 2026 5:47 PM | Updated on Mar 13 2026 6:10 PM

4 Years Live In Marrying Another agra Woman self destruction

ఆగ్రాలో ఒక మహిళ ఆత్మహత్య కలకలం రేపింది. నాలుగేళ్లు సహజీవనంచేసి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఇప్పుడు వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌పై ఆరోపణలు గుప్పిస్తూ చనిపోయే ముందు ఆమె ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు కూడా విజ్ఞప్తి చేయడంతో ఇది వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో  సంచలనంగా మారడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. అసలు స్టోరీ ఏంటంటే..

ప్రాథమిక సమాచారం ప్రకారం,  బాధిత మహిళది స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లా. ఆమె అంతకుముందే విడాకులు తీసుకుని, ఆగ్రాలో ఒక ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న క్రమంలో తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లోపనిచేస్తున్న జేవీ గౌతమ్ అనే కానిస్టేబుల్‌తో పరిచయమైంది. దీంతో గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.  పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కుటుంబం ఒప్పుకోదు అంటూ  పెళ్లికి నిరాకరించాడు.  చివరికి మరో అమ్మాయితో పెళ్లిక సిద్ధం కావడంతో వివాదం రేగింది. చివరికి వీడియో సందేశం రికార్డ్‌ చేసి ఆత్మహత్యకు పాల్పడింది.
 

ఆ వీడియోలో ఇలా పేర్కొంది..
తాను కలిసి  జీవించిన గౌతమ్‌  చేతిలో ఏళ్ల తరబడి శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఆ తర్వాత మాట తప్పాడని పేర్కొంది. గౌతమ్‌తో జీవించిన కాలంలో  తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఆమె పేర్కొంది.  ఫిర్యాదు చేయడానికి తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినప్పుడు, తమ చేతుల్లో ఏమీ లేదని, ఆ కానిస్టేబుల్‌పై ఎటువంటి చర్యలూ తీసుకోలేమని అక్కడివారు చెప్పినట్లు ఆమె తెలిపింది.తాను బతికి ఉన్నప్పుడు తనకు న్యాయం జరగలేదని, కనీసం తన మరణం తర్వాత అయినా తనకు న్యాయం జరగాలని ఆశించింది.  అంతేకాదు  గౌతమ్ , అతని కుటుంబ సభ్యులు తనను ఎంతో మోసం చేశారని, మానసికంగా వేధించారని, చివరికి ఈ దారుణ నిర్ణయం తీసుకునేలా తనను నెట్టారని ఆమె ఆరోపించింది. ఏళ్ల తరబడి అతనితో కలిసి జీవించిన తర్వాత, ఇప్పుడు అతను వేరొక మహిళను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని ఆ మహిళ వాపోయింది.

"నా మరణానికి జేవీ గౌతమ్ , అతని కుటుంబం మొత్తం కారణం. వారు నన్ను ఎంతగానో మోసం చేశారు. వారు నన్ను మానసికంగా ఎంతగా వేధించారంటే, చివరికి నేను చనిపోయేలా నన్ను బలవంతం చేశారు."  అని చెప్పింది. అలాగే ‘‘అతని అన్నయ్య ఒకవైపు నన్ను పెళ్లి చేసుకోమని చెబుతున్నాడు. మరోవైపు, నా కుటుంబం నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదని జేవీ గౌతమ్ నాతో చెబుతున్నాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ కనీసం ఏ అమ్మాయినీ మోసం చేయకు," అని పేర్కొంది.

 

ఆ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో  కానిస్టేబుల్ జె.వి. గౌతమ్‌ను సస్పెండ్ చేశారు. మరోవైపు ఆమె మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.  నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుమార్తెకు న్యాయం జరగాలని వారు డిమాండ్ చేశారు. బాధిత మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆ కానిస్టేబుల్‌పై  కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement