కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరో దశ సమావేశాల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కోల్కతాలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో ఇటీవల జరిగిన సమావేశంలో అధికార టీఎంసీ మినహా, రాష్ట్రంలోని చాలా రాజకీయ పార్టీలు ఒకటి లేదా రెండు దశల ఎన్నికలు కోరాయని, భద్రతా దళాల అధికారులు కూడా ఇలాంటి సూచనలే చేశారని చెప్పారు.
పశ్చిమ బెంగాల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికలకు సంబంధించిన హింసను అరికట్టడం సులభమవుతుంది. తుది నిర్ణయం తీసుకునే ముందు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారని ఆయన అన్నారు. ‘288 సీట్లున్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలను ఒకే దశలో నిర్వహించాం. పశ్చిమ బెంగాల్లోనూ ఒకే దశలో నిర్వహించడం అసాధ్యమైతే కాదు. అయితే.. ఇక్కడ భద్రతా అంశాల దృష్ట్యా అది అసంభవం అనిపిస్తోంది’ అని అన్నారు.
ఎన్నికల సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఈసీకి ప్రధాన ఆందోళనగా మారాయని, అయితే గట్టి నిఘా ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు హామీ ఇచ్చారని అధికారి తెలిపారు.


