కఠ్మాండు: ఇటీవల నేపాల్ పార్లమెంట్కు జరిగిన ఎన్నికల ఫలితాల్లో పూర్తి స్థాయి స్పష్టత వచ్చింది. ప్రధానమంత్రి అభ్యర్థి బాలేంద్ర షాకు చెందిన రాష్ట్రాయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) మొత్తం 182 స్థానాలను గెలుచుకుందని ఎన్నికల కమిషన్(ఈసీ) గురువారం ప్రకటించింది. ఈ పార్టీకి ప్రత్యక్ష ఎన్నికల్లో ఏకంగా 125 సీట్లు రాగా, దామాషా విధానంలో జరిగిన పోలింగ్లో అత్యధికంగా 57 సీట్లు దక్కించుకుందని ఈసీ తెలిపింది. నేపాల్ పార్లమెంట్లోని 275 సీట్లకు గాను, 165 మంది సభ్యులను ప్రత్యక్షంగాను, మిగతా 110 మందిని దామాషా విధానంలోను ఎన్నుకుంటారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సాధారణ మెజారిటీ 138 సీట్లు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(1)ప్రకారం అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన ఆర్ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. కఠ్మాండు మాజీ మేయర్ కూడా అయిన బాలేంద్ర షా(35), అలియాస్ బాలేన్ను ఆర్ఎస్పీ ఇప్పటికే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం తెల్సిందే. ఈ ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ 20 సీట్లు, సీపీఎన్–యూఎంఎల్కు 16, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ కి 9, శ్రమ్ శక్తి పార్టీ, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కి నాలుగు చొప్పున స్థానాలు దక్కాయి.


