యుద్ధ కల్లోలం | Iran says war will stop if 3 conditions are met | Sakshi
Sakshi News home page

యుద్ధ కల్లోలం

Mar 13 2026 3:07 AM | Updated on Mar 13 2026 3:07 AM

Iran says war will stop if 3 conditions are met

ఇరాక్‌లోని ఎర్బిల్‌ ఎయిర్‌పోర్టు వద్ద పేలుడుతో కమ్ముకున్న పొగ

దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా  

100 డాలర్లు దాటిన బ్యారెల్‌ ముడి చమురు ధర  

దాడులు ఆపకపోతే 200 డాలర్లు దాటడం తథ్యం  

గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేయాలి  

డిమాండ్‌ చేసిన ఇరాన్‌ సైన్యం  

మా బిడ్డల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాం  

అమెరికా, ఇజ్రాయెల్‌లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు  

హార్మూజ్‌ను తెరిచే ఆలోచన లేదు  

ఇరాన్‌ నూతన సుప్రీంలీడర్‌ మొజ్తబా ఖమేనీ స్పష్టీకరణ  

3 షరతులకు అంగీకరిస్తే యుద్ధం ఆగిపోతుందన్న ఇరాన్‌

దుబాయ్‌/టెహ్రాన్‌: పశ్చిమాసియాలో ఎడతెరిపిలేని యుద్ధం ధాటికి చమురు మంట మండుతోంది. విదేశీ చమురు రవాణా నౌకలు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్‌ సైన్యం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఫలితంగా బ్యారెల్‌ ముడి చమురు ధర గురువారం 100 డాలర్లు దాటేసింది. యుద్ధం మొదలైన తర్వాత ఏకంగా 38 శాతం పెరిగింది. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేసి, దాడులు ఆపకపోతే బ్యారెల్‌ ధర 200 డాలర్లకు చేరడం తథ్యమని ఇరాన్‌ సైన్యం హెచ్చరించింది. 

యుద్ధం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తుండడం, చమురు మంటలు మరింత పెరగడమే తప్ప ఇప్పట్లో చల్లారే సంకేతాలు లేకపోవడం ప్రపంచ దేశాల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కీలకమైన చమురు రవాణా మార్గమైన హార్మూజ్‌ను దిగ్బంధించడం ద్వారా ప్రపంచదేశాలపై.. ముఖ్యంగా అమెరికాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడమే ఇరాన్‌ వ్యూహంగా కనిపిస్తోంది. అమెరికా వైమానిక దాడుల్లో వందలాది మంది చిన్నారులు సహా సాధారణ ప్రజలు బలైపోవడం పట్ల ఇరాన్‌ నూతన సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. 

తమ బిడ్డల మరణాలకు ప్రతీకారం తీర్చుకోక తప్పదని తేల్చిచెప్పారు. శత్రుదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్‌లను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత యుద్ధంపై ఆయన స్పందించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మరోవైపు ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ అమెరికా–ఇజ్రాయెల్‌లకు కొత్త ఆఫర్‌ ఇచ్చారు. మూడు షరతులకు అంగీకరిస్తే తాము దాడులు ఆపేస్తామని చెప్పారు. ముడి చమురు నౌక షెన్‌లాంగ్‌ సూయిజ్‌మ్యాక్స్‌ హార్మూజ్‌ నుంచి సాహసోపేతంగా ముంబైకి చేరుకుంది. 

ఇరాన్‌ అమర్చిన సముద్ర మందుపాతరలైన ‘సీమైన్స్‌’కు చిక్కకుండా క్షేమంగా గమ్యస్థానానికి చేరుకోవడం సంచలనాత్మకంగా మారింది. యుద్ధం వల్ల చమురు ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రపంచదేశాలు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాయి. చమురు వినియోగంపై పరిమితులు విధిస్తున్నాయి. బుధవారం రాత్రి ఇరాక్‌లో ఉమ్‌ ఖాసర్‌ నగరంలోని ఖోర్‌ అల్‌ జుబేర్‌ నౌకాశ్రయంలో మార్షల్‌ ఐలాండ్స్‌ జెండాతో ఉన్న అమెరికా ముడిచమురు రవాణా నౌక ‘సేఫ్‌సీ విష్ణు’పై ఇరాన్‌ దాడిచేసింది. 

ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడు. అమెరికా చమురు నౌకలను టార్గెట్‌ చేశామని, బ్యారెల్‌ ముడి చమురు ధర త్వరలో 200 డాలర్లకు చేరబోతోందని ఇరాన్‌ మిలటరీ కమాండ్‌ ప్రధాన కార్యాలయం అధికార ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫాఖారీ స్పష్టంచేశారు. 

భద్రతా మండలి తీర్మానం బేఖాతర్‌ 
ఇరాన్‌ యుద్ధం గురువారం పదమూడో రోజుకు చేరుకుంది. దాడులు ప్రతిదాడులు యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. గల్ఫ్‌ దేశాలే లక్ష్యంగా ఇరాన్‌ సైన్యం బాంబుల మోత మోగించింది. దుబాయ్‌ తీరంలో కంటైనర్‌ నౌకపై దాడికి దిగింది. నౌక మంటల్లో చిక్కుకోగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ఉన్న ముహరాఖ్‌ ద్వీపాన్ని సైతం ఇరాన్‌ లక్ష్యంగా చేసుకుంది. 

క్షిపణి దాడుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సౌదీ అరేబియాలోని అతిపెద్ద షెబా చమురు క్షేత్రంపై డ్రోన్‌ను ప్రయోగించింది. రాజధాని రియాద్‌లో దౌత్యవేత్తల భవనంపై ఇరాన్‌ ప్రయోగించిన డ్రోన్‌ను మధ్యలోనే ధ్వంసం చేశామని సౌదీ అరేబియా ప్రకటించింది. పర్షియన్‌ గల్ఫ్‌లోని బస్రా పోర్టుపైనా ఇరాన్‌ దాడికి దిగడంతో ఇరాక్‌లోని చమురు కేంద్రాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. 

గల్ఫ్‌లో దాడులు ఆపాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆమోదించిన తీర్మానాన్ని ఇరాన్‌ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. కువైట్‌తోపాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌పై ఎప్పటిలాగే క్షిపణులు ప్రయోగించింది. యూఏఈలోని బ్యాంకులపై దాడులు జరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంటి నుంచే పని చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కువైట్‌లో ఓ భవనాన్ని ఇరాన్‌ క్షిపణి తాకడంతో ఇద్దరు గాయపడ్డారు. 

200 రాకెట్లు ప్రయోగించిన హెజ్‌బొల్లా 
ఇజ్రాయెల్‌పై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. హెజ్‌బొల్లా మిలిటెంట్లు లెబనాన్‌ భూభాగం నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌పై 200 రాకెట్లు ప్రయోగించారు. మరోవైపు ఇరాన్‌ క్షిపణులను తాము మధ్యలోనే ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. రాజధాని జెరూసలేంలో తెల్లవారుజామున సైరన్లు, భారీ శబ్దాల మోత వినిపించింది. జనం షెల్టర్లలో తలదాచుకున్నారు. 

ఇజ్రాయెల్‌ సైన్యం దూకుడుగా ముందుకెళ్తోంది. ఇరాన్‌తోపాటు లెబనాన్‌పై విస్తృత స్థాయి దాడులకు శ్రీకారం చుట్టింది. లెబనాన్‌లో ఇరాన్‌ అండదండలున్న హెజ్‌బొల్లా గ్రూప్‌ను క్షిపణులతో టార్గెట్‌ చేసింది. గురువారం జరిగిన రెండు దాడుల్లో 11 మంది సాధారణ ప్రజలు మరణించారు. లెబనాన్‌ రాజధాని బీరూట్‌లోజరిగిన దాడిలో 8 మంది మృతిచెందగా, 31 మంది క్షతగాత్రులయ్యారు. అరామైన్‌ టౌన్‌పై దాడిలో ముగ్గురు మృతి చెందారు. పేలుళ్ల శబ్దాలతో ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ దద్దరిల్లింది. 

ఇజ్రాయెల్‌ డ్రోన్‌ దాడుల్లో కనీసం 10 మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇరాన్‌ చమురుకు ఆయువుపట్టు లాంటి ఖర్గ్‌ ఐలాండ్‌పై దాడికి అమెరికా సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజంగా అదే జరిగితే దురాక్రమణదారుల రక్తం పర్షియల్‌ గల్ఫ్‌లో ఏరులై పారుతుందని ఇరాన్‌ పార్లమెంటరీ స్పీకర్‌ మొహమ్మద్‌ బాఘేర్‌ ఖలిబాఫ్‌ హెచ్చరించారు. తమ దీవుల జోలికి రావొద్దని అన్నారు. 

లెబనాన్‌లో 634కి చేరిన మృతులు
ఇజ్రాయెల్‌ దాడులతో లెబనాన్‌లో మృతుల సంఖ్య 634కు చేరినట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో 7.59 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ తెలియజేసింది. అయితే, లెబనాన్‌లో 1,300 మందికిపైగా మరణించా­రని ఇరాన్‌ ప్రభుత్వం పేర్కొంది. యుద్ధం కారణ­ంగా ఇజ్రాయెల్‌లో 12 మంది, గల్ఫ్‌­లో ఏడుగురు అమెరికా జవాన్లు మృతి చెందారు.

పెజెష్కియాన్‌ మూడు షరతులు 
పశ్చిమాసియాలో యుద్ధం ఆగాలంటే స్పష్టమైన మార్గం ఉందని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ స్పష్టంచేశారు. మూడు షరతులకు అంగీకరిస్తే దాడులు ఆగిపోతాయని పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. పశ్చిమాసియాలో శాంతికి తాము కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.రష్యా, పాకిస్తాన్‌ నేతలతో మాట్లాడుతూ ఇదే విషయం పునరుద్ఘాటించినట్లు తెలిపారు. 

ఇరాన్‌ దేశ చట్టబద్ధమైన హక్కులను గౌరవించాలని, ఇరాన్‌కు నష్టపరిహారం చెల్లించాలని, తమ దేశంపై భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణ జరగకుండా అంతర్జాతీయ గ్యారంటీలు కావాలని పెజెష్కియాన్‌ తేల్చిచెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్‌లపై ప్రతీకారానికి సిద్ధం అంటూ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ ప్రతిజ్ఞ చేయగా, అధ్యక్షుడు పెజెష్కియాన్‌ అందుకు భిన్నమైన స్వరం వినిపించడం చర్చనీయాంశంగా మారింది. 

ఇరువురు నేతల మధ్య సత్సంబంధాలు లేవని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా, యుద్ధంలో ఇరాన్‌ ఇప్పటికే పరాజయం పాలయ్యిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టంచేశారు. ఈ యుద్ధాన్ని ముగిస్తానని అన్నారు. ఇరాన్‌ యుద్ధం అమెరికాకు ఆర్థికంగా మోయలేని భారంగా మారుతోంది. యుద్ధం వల్ల మొదటి వారంలోనే 11.3 బిలియన్‌ డాలర్లు(రూ.1.04 లక్షల కోట్లు) ఖర్చయినట్లు పెంటగాన్‌ ప్రకటించింది.  

మొజ్తబా ఖమేనీ యుద్ధ శంఖారావం 
యుద్ధం ఆపే ప్రసక్తే లేదని, గల్ఫ్‌ దేశాలపై దాడులు ఉధృతం చేయబోతున్నామని ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతొల్లా మొజ్తబా ఖమేనీ(56) తేల్చిచెప్పారు. హార్మూజ్‌ జలసంధిని ఇప్పట్లో తెరిచే ఆలోచన లేదని వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనను ఇరాన్‌లో టీవీ న్యూస్‌ చానళ్లలో చదివి వినిపించారు. ఖమేనీ మాత్రం తెరపై కనిపించలేదు. 

తమ ప్రజలను బలి తీసుకున్న అమెరికా, ఇజ్రాయెల్‌లపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ యుద్ధం చాలా రోజులు కొనసాగుతుందని సంకేతాలి­చ్చారు. హార్మూజ్‌ జలసంధి నుంచి నౌకలను అనుమతించబోమని ఖమేనీ చెప్పడాన్ని బట్టి చూస్తే అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెచ్చరిల్లడం ఖాయమని స్పష్టమవుతోంది. 

ఇజ్రాయెల్‌–అమెరికా వైమానిక దాడిలో తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీతోపాటు తన భార్య, తన సోదరి, మేనకోడలు, మరో సోదరి భర్త మరణించిన సంగతి నిజమేనని తెలిపారు. తన తండ్రి మృతదేహాన్ని చూశానని అన్నారు. తనను సుప్రీం లీడర్‌గా ఎంపిక చేసిన విషయాన్ని టీవీలో చూశానని వెల్లడించారు. ఇరాన్‌పై యుద్ధం మొదలైన తర్వాత మొజ్తబా ఖమేనీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజలకు దర్శనమివ్వలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement