రాష్ట్రంలో సిలిం‘డర్‌’! | A worsening commercial gas shortage | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో సిలిం‘డర్‌’!

Mar 13 2026 2:39 AM | Updated on Mar 13 2026 2:39 AM

A worsening commercial gas shortage

గురువారం హైదరాబాద్‌ షాపూర్‌ నగర్‌లోని హెచ్‌ఎంటీ వద్ద రోడ్డు పక్కన చిన్న హోటల్‌ నడుపుకుంటున్న ఓ కుటుంబం వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల కొరతతో కట్టెల పొయ్యిపైనే ఇలా వంటలు చేస్తోంది. హోటల్‌ నడిస్తేనే తమకు పూట గడుస్తుందని చెప్పింది.

తీవ్రమవుతున్న వాణిజ్య గ్యాస్‌ కొరత 

చర్లపల్లిలోని 3 ప్రభుత్వ గ్యాస్‌ ప్లాంట్లలో రీ ఫిల్లింగ్‌ నిలిపివేత

వంట గ్యాస్‌కే ప్రాధాన్యత ఇవ్వడంతో రోడ్లపైనే లారీలు 

ఏజెన్సీల నుంచి స్టాక్‌ లేదనే సమాధానం 

ఆందోళనలో స్టార్‌ హోటళ్లు, బడా రెస్టారెంట్లు..మూతపడుతున్న చిన్న హోటళ్లు 

పరిశ్రమల్లో సైతం ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం 

పాల ఉత్పత్తి కేంద్రాలపైనా ప్రభావం చూపించే చాన్స్‌ 

ప్రైవేటు గ్యాస్‌ ఏజెన్సీలపై పెరుగుతున్న ఒత్తిడి 

పౌర సరఫరాల శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలు  

సాక్షి, హైదరాబాద్‌  :  పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం వల్ల పెట్రో ఉత్పత్తుల సరఫరాకు అంతరాయం కలుగుతుండటం, కేంద్రం ఆంక్షల నేపథ్యంలో.. రాష్ట్రంలో వాణిజ్య ఎల్‌పీజీ (కమర్షియల్‌ గ్యాస్‌) సిలిండర్ల కొరత తీవ్రరూపం దాల్చింది. గ్యాస్‌ ప్లాంట్లలో కమర్షియల్‌ సిలిండర్లను నింపే ప్రక్రియ ఆగిపోయింది. స్టార్‌ హోటళ్లు, పెద్ద రెస్టారెంట్లు, క్లబ్బుల నుంచి చిన్న టీ దుకాణాల వరకు గ్యాస్‌ కోసం ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. 

ఓ పది సిలిండర్లు సర్దండి’అంటూ గ్యాస్‌ ఏజెన్సీలను వేడుకుంటున్నా స్టాక్‌ లేదనే సమాధానమే వినిపిస్తోంది. ఎంత ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా ఫలితం ఉండటం లేదు. దీంతో చిన్న హోటళ్లు మూతపడుతున్నాయి. స్టార్‌ హోటళ్ల యాజమాన్యాల్లో కూడా పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. హోటళ్లతో పాటు పారిశ్రామిక ఉత్పత్తులపై కూడా గ్యాస్‌ కొరత తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 

రాష్ట్రంలో వినియోగమయ్యే ఎల్‌పీజీ గ్యాస్‌లో గృహ వినియోగం, హోటళ్లు, బేకరీలు, స్వీట్‌ దుకాణాలలో వినియోగించే గ్యాస్‌తో పోలిస్తే పరిశ్రమలకు వినియోగించే గ్యాసే ఎక్కువ. వీటితో పాటు పాలు, వాటి అనుబంధ ఉత్పత్తులు సరఫరా చేసే డెయిరీల్లో కూడా ఎల్‌పీజీ గ్యాస్‌ మంటలు రేపుతోంది. ఈ కారణంగా పాల సేకరణ నిలిచిపోతే గ్రామీణ పాడి పరిశ్రమ తీవ్ర సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూస్తామనే ప్రకటనలు తప్ప ఇతర వర్గాల గురించి పౌరసరఫరాల శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.  

హైదరాబాద్‌ నగర శివారులోని చర్లపల్లి ప్రాంతంలో భారత్, హెచ్‌పీ, ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీలకు సంబంధించిన మూడు ప్రధాన ఎల్‌పీజీ ఫిల్లింగ్‌ ప్లాంట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ఖాళీ అయిన గ్యాస్‌ సిలిండర్లన్నింటిలో ఎల్‌పీజీని ఇక్కడి నుంచే రీ ఫిల్లింగ్‌ చేస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయిల్‌ కంపెనీలు ఇచి్చన సూచనలతో చర్లపల్లిలో వాణిజ్య సిలిండర్లను ఫిల్‌ చేసే ప్రక్రియ దాదాపుగా నిలిచిపోయింది. ఇప్పటికే ఉన్న స్టాక్‌ను కొద్దికొద్దిగా సర్దుతున్నారు. 

రోజుకు 2 వేల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్లు తీసుకునే ఏజెంట్‌కు 100 నుంచి 200 సిలిండర్లు ఇవ్వడం గగనంగా మారిందని అంబర్‌పేటకు చెందిన ఓ ఏజెన్సీ నిర్వాహకుడు తెలిపారు. గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్‌ గ్యాస్‌ సరఫరాకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుండటంతో కమర్షియల్‌ సిలిండర్ల ఫిల్లింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెపుతున్నారు. దీంతో వందలాది గ్యాస్‌ లారీలు ప్లాంట్ల వెలుపల కిలోమీటర్ల మేర బారులు తీరాయి. సిలిండర్లతో వచ్చిన ట్రక్కులు రోజుల తరబడి నిలిచిపోవడంతో డ్రైవర్లు, క్లీనర్లు రోడ్లపైనే నిరీక్షించాల్సి వస్తోంది.  

పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగే పరిస్థితి 
చిన్న, మధ్య తరహా పరిశ్రమలు రోజుకు వేల టన్నుల ఎల్‌పీజీ వినియోగిస్తుంటాయి. నాచారం, ఉప్పల్, ఐడీఏ బొల్లారం, బాలానగర్, సనత్‌నగర్, కాటేదాన్, పటాన్‌చెరులలోని దాదాపు అన్ని పరిశ్రమలల్లో ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగం పెద్ద ఎత్తున ఉంటుంది. 19 కిలోల ఎల్‌పీజీ నుంచి 33, 47, 425, 450 కిలోల ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లను పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తుంటారు. భారీ పరిశ్రమలకు టన్నుల ఎల్‌పీజీతో కూడిన ట్యాంకర్‌ (బుల్లెట్‌)లను వినియోగిస్తారు. 

నగరంలోని బిస్కట్‌ కంపెనీలు, చాక్‌లెట్, పప్పు పాకెట్లు, మిఠాయిలు, తినుబండారాలు తయారు చేసే పరిశ్రమలు కూడా భారీగా గ్యాస్‌ను వినియోగిస్తున్నట్లు ఓ ప్రైవేట్‌ ఏజెన్సీ నిర్వాహకుడు తెలిపారు. మొత్తం ఎల్‌పీజీ వినియోగంలో పరిశ్రమలు దాదాపు 40 శాతం వాటా కలిగి ఉన్నట్లు ఓ అంచనా. కాగా దీనిపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో నగరంలో సేవారంగం, ఉత్పత్తి, ఆహార రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. కొన్ని పరిశ్రమలు ప్రైవేట్‌ గ్యాస్‌ కంపెనీలపై ఆధారపడుతున్నా అక్కడ కూడా సరఫరా పరిమితంగా ఉండటంతో పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. 

పాడి పరిశ్రమపై ప్రభావం! 
హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న పరిశ్రమలతో పాటు రాష్ట్రంలోని ప్రధానమైన పాల ఉత్పత్తి కేంద్రాలు, దానా తయారీ కేంద్రాలు చిక్కుల్లో పడే పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సహకార రంగంలో ఉన్న విజయ డెయిరీ, కరీంనగర్‌ డెయిరీ, ముల్కనూరు డెయిరీ, మదర్‌ డెయిరీ తదితరాలతో పాటు ప్రైవేటు రంగంలో కొన్ని పదుల సంఖ్యలో డెయిరీలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. 

గ్రామాల నుంచి పాలు సేకరించి, వాటిని శుద్ధి చేసి లక్షల లీటర్ల పాలను ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా విక్రయిస్తున్నారు. పాల ప్రాసెసింగ్‌లో భాగంగా వేడి చేసేందుకు, పెరుగు, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల తయారీకి ప్రతిరోజు గ్యాస్‌ సిలిండర్లు పెద్ద ఎత్తున అవసరం అవుతాయి. కాగా గ్యాస్‌ అందుబాటులో లేకపోతే డెయిరీల్లో కూడా ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.  

ప్రైవేట్‌ గ్యాస్‌ కంపెనీలకు బారులు 
ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సరఫరా తగ్గిపోవడంతో హోటల్‌ యజమానులు, పరిశ్రమల నిర్వాహకులు ప్రైవేట్‌ ఎల్‌పీజీ కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రైవేటు రంగంలోని గో గ్యాస్, టోటల్, అజియాస్, సూపర్, స్ఫూర్తి, భాగ్యనగర్‌ గ్యాస్‌ వంటి ప్రైవేటు కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఆయా గ్యాస్‌ ఏజెన్సీలు ఇప్పటికే ఎల్‌పీజీ గ్యాస్‌ ధరను కిలో రూ.140కి పెంచాయి. 7వ తేదీకి ముందు ఇది రూ.104గా ఉంది. ఇక 21 కిలోల ప్రైవేటు ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ రూ.3 వేలు పలుకుతోంది. దీన్ని బ్లాక్‌లో రూ.5 వేలకు కూడా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రభుత్వ రంగంలోని మూడు కంపెనీల ఏజెన్సీలు కూడా బ్లాక్‌లో సిలిండర్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయనే ఆరోపణలు విని్పస్తున్నాయి. కాగా దేవాలయాల్లో జరిగే అన్నదాన కార్యక్రమాలు, తీర్థ ప్రసాదాల తయారీపై కూడా గ్యాస్‌ కొరత ప్రభావం పడింది. హాస్పిటళ్లలో, జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.5కే భోజనం అందించే హరేకృష్ణ ఫౌండేషన్‌కు ప్రతిరోజు దాదాపు 100 సిలిండర్లు అవసరం. సిలిండర్ల సరఫరా లేకపోతే ఆ సంస్థకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement