పంట కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీరు
మునుగోడు/ముస్తాబాద్/వీర్నపల్లి(సిరిసిల్ల): యాసంగి సీజన్ ఆరంభంలో పుష్కలంగా నీరు పోసిన బోర్లు.. ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయంలో భూగర్భ జలాలు పడిపోవడంతో రైతులు వేల రూపాయలు ఖర్చు చేసి.. ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించి పొలాలకు పెడుతున్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లు వట్టిపోతున్నాయి. గ్రామంలో దాదాపు 50 మందికి పైగా రైతులు ట్యాంకర్లతో నీటిని తెప్పించి పొలాలకు పెడుతున్నారు.
ఒక్కొక్క ట్యాంకర్ నీటికి రూ.వెయ్యి నుంచి రూ.1500 తీసుకుంటున్నారు. ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించుకునే స్థోమత లేని రైతులు వరి పంటను అలాగే వదిలేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎండుతున్న వరిపంటను పలువురు రైతులు పశువులకు మేతగా వదిలి పెడుతున్నారు.
ముస్తాబాద్ మండలం సేవాలాల్తండాలో నక్కవాగు పరీవాహక ప్రాంతంలో బోరుబావుల కింద వెయ్యి ఎకరాలలో వరి పంట సాగు చేస్తున్నారు. ఎండలతో నక్కవాగు ప్రవాహం అడుగంటగా సమీపంలోని పొలాలు ఎండిపోయాయి. సేవాలాల్తండాకు చెందిన లకావత్ రవినాయక్ అతని సోదరులు కలిసి నాలుగు ఎకరాలలో వరిపంట సాగు చేయగా.. నీళ్లు లేక ఎండిపోయాయి. దీంతో వారు రూ.1.20 లక్షల వరకు నష్టపోయారు.


