డ్రిల్లింగ్ ఎక్స్పర్ట్ను పంపాలని సీడబ్ల్యూపీఆర్ఎస్ను కోరిన నీటిపారుదల శాఖ
సాక్షి, హైదరాబాద్: కుంగిపోయిన మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఎన్నో సాంకేతిక అవాంతరాలు ఎదురవుతున్నాయి. బరాజ్ పునరుద్ధరణకు ముందు దాని పునాదుల కింద భూగర్భ స్వభావం, దాని స్థితిగతులను నిర్థారించడం కీలకం కాగా, ఆ సమాచారం ఆధారంగానే పునరుద్ధరణ డిజైన్లను రూపొందిస్తారు. ఈ సమాచారం కోసం బరాజ్ కాజ్వే, స్పిల్వేకు బోరు రంధ్రాలు (బోర్హోల్స్) చేయాల్సి ఉండగా, సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
బరాజ్ పునాదుల కింద నదీగర్భంలో ఉన్న సమస్యలను గుర్తించడానికి జియో ఫిజికల్, జియో టెక్నికల్, హైడ్రాలిక్ మోడల్ పరీక్షలను నిర్వహించడానికి పూణెలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ పవర్ అండ్ వాటర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)కు గతంలో వర్క్ఆర్డర్ జారీ చేసింది.
ఈ పరీక్షల్లో భాగంగా బోర్హోల్స్ వేసేందుకు ప్రయత్నించడంతో తీవ్ర సమస్యలు ఉత్పన్నమైనట్టు సమాచారం. దీంతో క్షేత్రస్థాయిలో పరీక్షించి బోర్హోల్స్ తవ్వడానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి సత్వరంగా డ్రిల్లింగ్ నిపుణుడిని పంపాలని సీడబ్ల్యూపీఆర్ఎస్కు రాష్ట్ర నీటిపారుదల శాఖ తాజాగా విజ్ఞప్తి చేసింది.


