‘కాళేశ్వరం’పై ఏప్రిల్‌ 8న తీర్పు | Arguments concluded in the High Court on the Justice Ghosh Commission report | Sakshi
Sakshi News home page

‘కాళేశ్వరం’పై ఏప్రిల్‌ 8న తీర్పు

Mar 13 2026 2:05 AM | Updated on Mar 13 2026 2:05 AM

Arguments concluded in the High Court on the Justice Ghosh Commission report

జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై హైకోర్టులో ముగిసిన వాదనలు

ఆరు నెలల నుంచి సుదీర్ఘ వాదనలు విన్న సీజే ధర్మాసనం 

లిఖిత పూర్వక వాదనల సమర్పణకు ఒకట్రెండు రోజులు అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ నివేదికను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లలో అన్ని పక్షాల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఏప్రిల్‌ 8న తుది ఉత్తర్వులు వెలువరిస్తామని చెప్పింది. లిఖిత పూర్వక వాదనలు సమర్పించడానికి ఒకట్రెండు రోజులు అవకాశం ఇచ్చింది. అప్పటివరకు పిటిషనర్లపై ఎలాంటి చర్యలొద్దన్న మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది. 

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్‌ ఘోష్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా.. చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ సీఎస్‌ శైలేంద్ర కుమార్‌ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌ హైకోర్టులో గత సెప్టెంబర్‌లో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు దామ శేషాద్రినాయుడు, రామచంద్రరావు, న్యాయవాది తరుణ్‌ జి.రెడ్డి వాదనలు వినిపించారు.  

మీడియాకు వివరాలు ఎందుకు ఇచ్చారు? 
శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘ప్రభుత్వం కమిషన్‌ ఏర్పాటు చేయడాన్ని, దర్యాప్తు సీబీఐకి అప్పగించడాన్ని మేము తప్పుబట్టడం లేదు. లోపభూయిష్టంగా కమిషన్‌ ఏర్పాటు, చట్టవిరుద్ధంగా చేపట్టిన విచారణను మాత్రమే ప్రశ్నిస్తున్నాం. నివేదికను అసెంబ్లీలో ఉంచి చర్చ జరగకముందే మీడియాకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చి.. వివరాలు వెల్లడించాల్సిన అత్యవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలి. చట్టప్రకారం, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్‌ నివేదిక రూపొందించింది.

 ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమిషన్‌ ఏర్పాటు చేశామంటున్న ప్రభుత్వం.. పిటిషనర్ల కీర్తి ప్రతిష్టలు దెబ్బతీసేలా చేయడం సరికాదు. బహుళ ప్రయోజనాలతోనే నాటి ప్రభుత్వం కాళేశ్వరం చేపట్టింది. దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రంగా మారింది. 13 జిల్లాలకు తాగు, సాగు నీటిని అందించింది. అంచనాతో పోలిస్తే వ్యయం పెరగని ఒక్క ప్రాజెక్టు ఇరు రాష్ట్రాల్లో ఉంటే చూపాలి? కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే కమిషన్‌ వేశారు. నివేదిక చట్టవిరుద్ధం. రద్దు చేయాలి’అని చెప్పారు. 

రాంచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. చట్టంలోని నిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేసిన కమిషన్‌ చెల్లదన్నారు. తరణ్‌ జి.రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సాక్షిగా పిలిచి వివరాలు తీసుకుని నివేదికలో ఇష్ట్రం వచ్చినట్లు పరువుకు నష్టం కలిగించేలా ఆరోపణలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పు రిజర్వు చేసింది.   

భవన వివాదాలపై ట్రిబ్యునళ్లు
ఏర్పాటు చేయాలని సర్కార్‌కు హైకోర్టు సూచన 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల పరిధిలోని భవన నిర్మాణ అనుమతులు, అక్రమ నిర్మాణాల సీజ్, కూల్చివేతలు లాంటి వివాదాలపై ప్రత్యేక ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. రాజ్యాంగ ధర్మాసనానికి వచ్చే పిటిషన్ల సంఖ్య తగ్గడంతోపాటు ఇప్పటివరకు ఉన్న కేసుల భారం కూడా కొంత తగ్గుతుందని వ్యాఖ్యానించింది. ధర్మాసనం సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అడ్వొకేట్‌ జనరల్‌ ఏ.సుదర్శన్‌రెడ్డి చెప్పారు. అనంతరం స్థల వివాదంపై దాఖలైన అప్పీల్‌ను ధర్మాసనం ఏప్రిల్‌ 15కు వాయిదా వేసింది. 

టైటిల్‌ను పరిశీలించకుండా మేడ్చల్‌ మల్కాజిగిరి ఉప్పల్‌ మండలం కొత్తపేట సర్వే నంబర్‌ 106, 107లో భవన నిర్మాణానికి రాధేశ్యామ్‌ కన్‌స్ట్రక్షన్‌కు అనుకూలంగా 2025, అక్టోబర్‌ 10న అనుమతి మంజూరు చేయడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో హబ్సిగూడకు చెందిన శ్రీనివాస్‌యాదవ్, మలక్‌పేట్‌కు చెందిన డీఈ నాగరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి.. కమిషనర్‌ ప్రాథమికంగా టైటిల్, సబ్జెక్ట్‌ ఆస్తిపై హక్కులు ధ్రువీకరించిన తర్వాతే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేశారని, అనుమతిని రద్దు చేయమని చెప్పడానికి పిటిషనర్ల వద్ద సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను కొట్టివేశారు.  

న్యాయాధికారులను కేటాయిస్తాం.. 
దీన్ని సవాల్‌ చేస్తూ పిటిషనర్లు అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అప్పీల్‌ విచారణ సందర్భంగా ఇలాంటి వేలాది పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉండటాన్ని ప్రస్తావించింది. ప్రతీ వివాదం నేరుగా హైకోర్టుకు రాకుండా ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తే సత్వర పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడింది. ఈ విషయాన్ని ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చించాలని ఏజీకి సూచించింది. 

ప్రత్యేక ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొస్తే న్యాయాధికారులను కేటాయిస్తామంది. దీనిపై ఏజీ స్పందిస్తూ.. ఈ విషయంపై ప్రభుత్వానికి న్యాయసలహా ఇస్తానని పేర్కొన్నారు. ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలన్న విషయాన్ని తమ తీర్పులో ప్రస్తావిస్తామని.. అప్పుడు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను మూడు వారాలపాటు వాయిదా వేస్తున్నామని.. అప్పటివరకు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని సూచించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement