సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు అందించారు. ఈ నెల 16న ఢిల్లీ హైకోర్టులో జరిగే విచారణకు హాజరుకావాలని సూచించారు. సరైన ఆధారాలు లేవంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మద్యం కేసును కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ తీర్పుపై సీబీఐ.. ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ వేసింది.
ఈ మేరకు కేసులో నిందితులుగా పేర్కొన్న ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సహా 23 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం సీబీఐ అధికారులు కోర్టు నోటీసుల కాపీని బంజారాహిల్స్లోని కవిత నివాసంలో అందించారు. సీబీఐ అధికారులు తనకు నోటీసులు ఇచ్చినట్టు కవిత ధ్రువీకరించారు. ఈ విషయంపై తమ లీగల్ బృందంతో చర్చిస్తున్నామని, విచారణకు సహకరిస్తానని కవిత ఎక్స్లో పోస్ట్ పేర్కొన్నారు.


