2030కి 258.4 కిలోమీటర్లకు, 2040కి 534.1 కి.మీ.లకు
336.4 కి.మీ. ఎంఎంటీఎస్... 19,352 కి.మీ. రోడ్ నెట్వర్క్
రూ.4 లక్షల కోట్లతో హెచ్ఎండీఏ సమగ్ర రవాణా ప్రణాళిక
వర్క్షాప్లో పాల్గొన్న పలువురు ఉన్నతాధికారులు
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరాభివృద్ధి విస్తరణలో భాగంగా 2050 నాటికి 556.6 కి.మీ. వరకు మెట్రో కారిడార్ల ఏర్పాటును హెచ్ఎండీఏ ప్రతిపాదించింది. ప్రజా రవాణా సదుపాయాల విస్తరణలో భాగంగా 336.4 కి.మీ. వరకు ఎంఎంటీఎస్ సదుపాయాలను పెంచనున్నారు. దశలవారీగా 19,352 కి.మీ. రోడ్ నెట్వర్క్ను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. మహానగర అభివృద్ధి, విస్తరణకు అనుగుణంగా ‘మాస్టర్ ప్లాన్–2050’ రూపకల్పన తుది దశకు చేరుకుంది. కీలకమైన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ)పై గురువారం వర్క్షాప్ నిర్వహించారు.
హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధ్యక్షత వహించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎంఏయూడీ) జయేశ్ రంజన్, మరో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్, రవాణా శాఖ కమిషనర్ కె.ఇలంబర్తి, ఎఫ్సీడీఏ కమిషనర్ కె.శశాంక, పట్టణ రవాణా అంశాలపై ప్రభుత్వ సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి, డీటీసీపీ డైరెక్టర్ ఎస్. దేవేందర్రెడ్డి, జేఎన్టీయూ కాకినాడ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ పాల్గొన్నారు.
ప్రణాళికలపై విస్తృత చర్చ
మాస్టర్ ప్లాన్–2050లో భాగంగా రూపొందించనున్న ఆర్థికాభివృద్ధి, సమగ్ర మొబిలిటీ, మౌలిక సదుపాయాల కోసం ప్రతిపాదించిన బ్లూ, గ్రీన్ ప్రణాళికలపై హెచ్ఎండీఏ అధికారులు వివరించారు. లీ అసోసియేట్స్ రూపొందించిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్పై విస్తృత చర్చ జరిగింది. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, నిపుణులు సలహాలు, సూచనలను అందజేశారు. ప్రభుత్వ సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి, ‘ట్రాన్సిట్ ఫస్ట్’ విధానం ప్రాముఖ్యతను వివరించారు.
ఇదీ సమగ్ర రవాణా ప్రణాళిక
» 2050 వరకు సమగ్ర రవాణా ప్రణాళిక అమలుకు రూ.4 లక్షల కోట్లు అవసరమని అంచనా.
» మెట్రో రైల్ను 2030 నాటికి 258.4 కిలోమీటర్లకు, 2040 నాటికి 534.1 కి.మీ.లకు, 2050 నాటికి 556.6 కి.మీ.లకు విస్తరించాలి.
» 2030 నుంచి 2040 నాటికి ఎంఎంటీఎస్ నెట్వర్క్ను 202 కి.మీ.నుంచి 255.6 కి.మీ.కు పెంచాలి. 2050 నాటికి మొత్తం 336.4 కి.మీ.లకు విస్తరించాలి.
» 2030 నుంచి 2040 వరకు, ఆ తరువాత 2050 వరకు దశలవారీగా కొత్త రోడ్లు, హైవేలు, 18 మీటర్ల కంటే వెడలై్పన కారిడార్లను నిర్మించాలి. 2050కి 19,352 కి.మీ.లకు రోడ్ నెట్వర్క్ను పెంచాల్సి ఉంటుంది.
» 2050కి 75 గ్రేడ్ సెపరేటర్లు, 120 ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్ల ఏర్పాటును ప్రతిపాదించారు. 34 ఆర్ఓబీలు, 16 ఆర్యూబీలు అవసరం అని, 8 చోట్ల ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించాలని నిర్ణయించారు.
» మూసీ ప్రక్షాళనలో భాగంగా 29 చోట్ల వంతెనలు నిర్మించి రవాణా సదుపాయాలను మెరుగుపర్చాలి.
» ప్రత్యేక బస్ మార్గాలను ఏర్పాటు చేయాలి. బీఆర్టీఎస్, డీబీఎల్ సదుపాయాలను అభివృద్ధి చేయాలి. 2040 నాటికి 29 కి.మీ. 2050 నాటికి 48 కి.మీ.చొప్పున ఈ కారిడార్లను ఏర్పాటు చేయాలి. 2050 వరకు ఏడు భారీ బస్ టెర్మినళ్లను, ట్రక్ టెర్మినళ్లను ఏర్పాటు చేయాలి.


