‘బోరు’మన్న కుటుంబం | Mother jumps into well with three children due to debt | Sakshi
Sakshi News home page

‘బోరు’మన్న కుటుంబం

Mar 13 2026 2:24 AM | Updated on Mar 13 2026 2:24 AM

Mother jumps into well with three children due to debt

అప్పుల బాధతో ముగ్గురు పిల్లలతో కలిసిబావిలోకి దూకిన తల్లి 

తల్లితోపాటు ఇద్దరు కూతుళ్లు మృతి 

కట్టెను పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్న కొడుకు

భూత్పూర్‌: అసలే అప్పులు పెరిగిపోయాయి.. బావి వద్ద మరో బోరు వేయొద్దని వాదించినా భర్త వినలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఇల్లాలు తన ముగ్గురు పిల్లలతో కలిసి బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లితోపాటు ఇద్దరు కూతుళ్లు మృత్యువాత పడగా, కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం ఎల్కిచర్ల గ్రామానికి చెందిన కుర్వకేత బీరయ్య–జంగమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. 

బీరయ్య గతేడాది పొలంలో రెండు బోర్లు వేయగా నీరు పడలేదు. దీంతో బీరయ్య భార్య జంగమ్మతో కలిసి 150 గొర్రెలు తెచ్చుకొని వాటిని సాకుతూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల పాత ఇంటిని కూలగొట్టి పునర్నిర్మించగా.. రూ.30 లక్షల వరకు అప్పు అయింది. ఈ క్రమంలోనే బీరయ్య పొలం వద్ద మరో బోరు వేస్తానని చెప్పడంతో భార్య జంగమ్మ వద్దని వారించింది. అయినా, బుధవారం బీరయ్య పొలంలో బోరు వేయగా నీరు రాలేదు. ఆ వెంటనే మరో చోట బోరు వేయడానికి భర్త ప్రయత్నిస్తుండటంతో భర్తతో వాదించింది. 

బుధవారం సాయంత్రం సైతం గొర్రెల మంద వద్ద ఉన్న భర్తను బతిమాలిన వినలేదు. గురువారం తెల్లవారుజామున బోరు వేస్తుండటంతో గమనించిన జంగమ్మ(35) ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి తన కుమార్తెలు జ్యోతి (14), శైలజ (12)తోపాటు కుమారుడు జశ్వంత్‌ను పొలానికి కొద్ది దూరంలో ఉన్న బావి వద్దకు బలవంతంగా తీసుకెళ్లి పిల్లలను తోసేసి తానూ బావిలో దూకింది. 

ఈ ఘటనలో జంగమ్మతోపాటు ఇద్దరు కూతుళ్లు మృతిచెందగా, కొడుకు జశ్వంత్‌ బావిలో ఉన్న కట్టెను పట్టుకొని బయటకు వచ్చాడు. గ్రామంలోని పెద్దలు, బంధువులకు తల్లి, అక్కలు బావిలో దూకారని చెప్పాడు. దీంతో బంధువులు బావి వద్దకు వచ్చి తాళ్ల సహాయంతో మృతదేహాలను బయట కు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.

మూడు రోజుల క్రితమే పాఠశాల నుంచి వచ్చి..
భూత్పూర్‌ సమీపంలోని రాజీవ్‌ స్వగృహలోని జ్యోతిరావు పూలే బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలో జ్యోతి 9వ తరగతి, శైలజ 5వ తరగతి చదువుతున్నారు. జంగమ్మ పాఠశాలకు వెళ్లి ఫంక్షన్‌ ఉందని ప్రిన్సిపాల్‌కు చెప్పి 3 రోజుల క్రితమే కూతుళ్లను ఇంటికి తీసుకొ చ్చింది. ఇంతలో ఈ ఘాతుకానికి పాల్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement