న్యూఢిల్లీ: హోర్ముజ్ జలసంధి వద్ద దాడులు పెరుగుతున్న వేళ ఇరాన్తో నౌకాయాన భద్రతపై భారత్ చర్చించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చితో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడారు. హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో నౌకాయాన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీపై చర్చించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది.
ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న పరిస్థితి, సముద్ర రవాణాకు ప్రమాదాలు పెరుగుతున్న సమయంలో ఈ చర్చలు జరిగాయి. ఆ మార్గం ద్వారా నౌకలు సురక్షితంగా ప్రయాణించటం, చమురు సరఫరా స్థిరంగా కొనసాగటం వంటి అంశాలపై కేంద్రీకృతమైందని ఈ చర్చలు జరిగినట్లు భారత విదేశాంగ అధికార ప్రతినిది రణ్ధీర్ జైస్వాల్ చెప్పారు.
ఇరు దేశాల విదేశాంగ మంత్రులు పలుసార్లు సంప్రదింపులు జరిపారని జైస్వాల్ తెలిపారు. “గత కొన్ని రోజుల్లో భారత విదేశాంగ మంత్రి, ఇరాన్ విదేశాంగ మంత్రి మధ్య పలుసార్లు సంభాషణ జరిగింది. చివరిసారిగా జరిపిన చర్చలో నౌకాయాన భద్రత, భారత ఎనర్జీ భద్రతకు సంబంధించిన అంశాలు చర్చించాం. ఇంకా మేము ఏమి చెప్పినా తొందరపాటే అవుతుంది” అని తెలిపారు.
పశ్చిమాసియా యుద్ధం వేళ హోర్ముజ్ జలసంధి వద్ద కూడా ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఇటీవలి జరిగిన దాడుల్లో పలు నౌకలు దెబ్బతినడంతో ప్రపంచ నౌకాయాన వ్యవస్థ, ఎనర్జీ సరఫరాపై అంతరాయాలు కలుగుతున్నాయి.
మరోవైపు, ఇవాళ సౌదీ ఆయిల్ ట్యాంకర్ నౌక ముంబై చేరుకుంది. లైబీరియాకు చెందిన నౌకలో క్రూడాయిల్ దిగుమతి అయింది. యుద్ధం మొదలైన తర్వాత హర్మూజ్ దాటిన మొదటి నౌక ఇదే. 1.35 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ దిగుమతి అయింది.


