టెహ్రాన్ : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో తీవ్ర సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, జీ-7 దేశాలు ప్రత్యేక సమావేశం జరిపి అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సిన చమురు నిల్వలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ దేశాలు చమురు ధరలు ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని ప్రకటించింది.
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా చమురు మార్కెట్లో తలెత్తిన అంతరాయాలను పరిష్కరించేందుకు అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ అత్యవసర నిల్వల నుండి 4 మిలియన్ల బ్యారెళ్ల చమురును మార్కెట్కు అందుబాటులోకి తీసుకురావాలని 32 సభ్య దేశాలు నేడు ఏకగ్రీవంగా నిర్ణయుంచినట్లు సమాచారం.
EA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ మాట్లాడుతూ "ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చమురు సంక్షోభం ఉందని కనుకటి IEA సభ్య దేశాలు తక్షణమే స్పందించి అధిక మెుత్తంతో చమురు నిల్వలువిడుదల చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. అయితే మరోవైపు ఇరాన్ చమరు ధరల పెరుగుదలపై ప్రపంచదేశాలకు వార్నింగ్ ఇచ్చింది.
" బ్యారెల్ చమురు ధర 200 డాలర్లు చెల్లించడానికి ప్రపంచదేశాలు సిద్ధంగా ఉండాలి. 1970 తర్వాత ఏర్పడిన చమురు సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి (IEA) పెద్ద మెుత్తంలో చమురు నిల్వలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉండాలి" అని తెలిపింది. ప్రస్తుతం చమురు బ్యారెల్ ధర 90 -110 డాలర్లుగా ఉంది. అదే విధంగా హర్మూజ్ జలసంధి మీదుగా చమురు రవాణాకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతులిచ్చేది లేదని ఒక వేళ తమని కాదని వెళితే నౌకలను పేల్చివేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే మూడుకు పైగా నౌకలను పేల్చివేసింది.
కాగా ఇంత సంక్షోభ పరిస్థితుల్లోనూ భారత్ వెళ్లే నౌకలకు ఇరాన్ అనుమతిచ్చింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ జరిపిన చర్చలు ఫలించి భారత నౌకలకు హార్మూజ్ జలసంధిలో రవాణాకు పచ్చ జెండా ఊపింది.. కాగా పశ్చిమాసియా యుద్దం ప్రారంభమై దాదాపు రెండు వారాలు గడుస్తోంది. ఈ దాడిలో ఇప్పటివరకూ 2వేలకు పైగా ప్రజలు మృతిచెందారు. అయితే అమెరికా, ఇరాన్ ఇరు దేశాలు తగ్గకపోవడంతో యుద్దం ఇంకా కొనసాగుతోంది.


