చమురు రాజకీయాలే అసలు కారణమా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని సైన్యం ఇజ్రాయెల్తో కలిసి ఫిబ్రవరి 2026 చివరి వారంలో ఇరాన్పై భారీ దాడులకు దిగింది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని, అది ప్రపంచ శాంతికి ముప్పు అని వైట్ హౌస్ వాదిస్తున్నప్పటికీ తెర వెనుక అసలు కథ వేరే ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అణ్వాయుధాలు ఇప్పటికే తమవద్ద ఉన్నాయని బాహాటంగా చెబుతున్న ఉత్తర కొరియా విషయంలో అమెరికా మెతక వైఖరి అవలంబిస్తూ ఇరాన్ను లక్ష్యం చేసుకోవడం వెనుక ‘చమురు రాజకీయాలు’ బలంగా పనిచేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది.
అణుసాకుతో చమురుపై కన్ను?
ట్రంప్ ప్రభుత్వం అధికారికంగా ఇరాన్ అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యమని చెబుతోంది. అయితే, తాజాగా జరిగిన దాడుల వల్ల ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్ వంటి అణు కేంద్రాలతో పాటు ఆ దేశ నౌకాదళం, క్షిపణి వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. ఇరాన్ వద్ద భారీ చమురు నిల్వలు ఉన్నాయి. రోజుకు సుమారు 3.5 మిలియన్ బారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఇరాన్ సొంతం.
హర్మూజ్ జలసంధి
ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా కలిగిన హర్మూజ్ జలసంధిపై ఇరాన్కు పట్టు ఉంది. ఈ ప్రాంతంలో ఆధిపత్యం సాధించడం ద్వారా అటు చైనాకు చమురు సరఫరాను అడ్డుకోవడం, ఇటు ప్రపంచ ఇంధన మార్కెట్ను నియంత్రించడం అమెరికా వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉత్తర కొరియాకు అభయహస్తం?
మరోవైపు, కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా ఇప్పటికే డజన్ల కొద్దీ అణ్వాయుధాలను, ఎకాఎకి అమెరికాను చేరుకోగల ఐసీబీఎం క్షిపణులను కలిగి ఉంది. ఇటీవల జరిగిన వర్కర్స్ పార్టీ కాంగ్రెస్లో కిమ్ తన అణు సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటామని స్పష్టం చేశారు.
కిమ్కు ఎందుకు మినహాయింపు?
నిపుణులు అభిప్రాయం ప్రకారం.. ఉత్తర కొరియా దగ్గర ఎటువంటి చమురు నిల్వలు లేవు. అక్కడ యుద్ధం చేస్తే ప్రాణ, ఆస్తి నష్టం తప్ప అమెరికాకు లభించే ఆర్థిక ప్రయోజనం శూన్యం. గతంలోనూ కిమ్ను ట్రంప్ గొప్ప నాయకుడుగా అభివర్ణించారు. తాజాగా కూడా ఉత్తర కొరియా అణు హోదాను గుర్తిస్తే చర్చలకు సిద్ధమని కిమ్ సంకేతాలిచ్చారు. ఇరాన్పై కఠినంగా ఉండే ట్రంప్, ఉత్తర కొరియా విషయంలో మాత్రం చాకచక్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం.
‘ప్రస్తుతం ఒక దేశం దగ్గర చమురు ఉంటే అది ఆ దేశానికి వరమో లేక అగ్రరాజ్యాల దాడులకు కారణమయ్యే శాపమో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అణ్వాయుధాల కంటే చమురు నిల్వలే అమెరికా యుద్ధ ప్రాధాన్యతలను నిర్ణయిస్తున్నాయని ఇరాన్ ఉదంతం మరోసారి నిరూపిస్తోంది’ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: డబుల్ రిలీఫ్.. పసిడి, వెండి ప్రియులకు ఊరట


