హర్మూజ్ జలసంధి మూతపడితే...???
ఇజ్రాయెల్ - ఇరాన్ల మధ్య యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. వారం రోజుల పరస్పర క్షిపణి దాడుల తరువాత ఇరుదేశాలిప్పుడు పైచేయి కోసం కొత్త ఎత్తుగడలు పన్నుతున్నాయి. జోక్యం చేసుకోవాలని ఒకవైపు ఇజ్రాయెల్ అమెరికాను రెచ్చగొడుతూంటే.. ఇరాన్ హర్మూజ్ జలసంధిని దిగ్బంధం చేయడం ద్వారా సమస్యను అంతర్జాతీయ చేసే ప్రయత్నాల్లో ఉంది. ఏమిటీ హర్మూజ్ జలసంధి? దాన్ని మూసేస్తే ప్రపంచానికి మరీ ముఖ్యంగా భారత్కు ఏమిటి నష్టం?(India Effects With Hormuz Block). సూయెజ్ కెనాల్... యూరప్ దేశాలను హిందూ మహాసముద్రంతో కలిపే సముద్ర మార్గం. సరుకుల రవాణాకు అత్యంత కీలకం. సూయెజ్ లాంటిదే ఈ హర్మూజ్ జలసంధి కూడా. ఇరాన్, ఒమాన్ల మధ్య ఉంటుంది. పర్షియన్ జలసంధిని ఒమాన్ జలసంధితో, అరేబియా సముద్రంతోనూ కలుపుతుంది. సూయెజ్ కెనాల్, హర్మూజ్ జలసంధులు రెండింటి ద్వారా ముడిచమురు, ఎల్ఎన్జీలు సరఫరా అవుతూంటాయి. మన దేశం సౌదీ అరేబియా, ఖతార్ తదితర మధ్యప్రాచ్చ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు, ఎల్ఎన్జీ గ్యాస్లు సూయెజ్తోపాటు హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా అవుతూంటాయి. ప్రపంచ చమురు రవాణాలో సుమారు తొమ్మిది శాతం సూయెజ్ కెనాల్ ద్వారా జరుగుతుంటే.. అంతకు రెట్టింపు మోతాదు హర్మూజ్ ద్వారా సాగుతూంటుంది. భారీ నౌకలు, ఆయిల్ కంటెయినర్లు ఉన్న నౌకలు వీటిని భారత్తోపాటు ఇతర ఆసియా దేశాలకు సరఫరా చేస్తూంటాయి. భారత్ తన చమురు అవసరాల్లో 80 శాతం వరకూ దిగుమతుల ద్వారా పూర్తి చేసుకుంటూ ఉంటుంది. ఇరాక్లోని బస్రా నుంచి అత్యధికంగా 20 - 23 శాతం వస్తూంటే.. రష్యా నుంచి వచ్చేది 18 - 20 శాతం వరకూ ఉంటుంది. ఇవి కాకుండా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, అమెరికా (ఆరేడు శాతం), నైజీరియా, పశ్చిమ ఆఫ్రికా, కువైట్ల నుంచి మిగిలిన ముడిచమురు కొనుగోలు చేస్తూంటాం. ద్రవరూప సహజ వాయువు (ఎల్ఎన్జీ) విషయానికి వస్తే మన దిగుమతుల్లో సగం ఖతార్ నుంచి అందుతూంటే.. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఆస్ట్రేలియా, రష్యా, మొజాంబీక్ల నుంచి మిగిలిన సగం వస్తాయి. 2022 తరువాత అంటే ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తరువాత రష్యా నుంచి ఎల్ఎన్జీ దిగుమతులు కొంచెం పెరిగాయి. ఇజ్రాయెల్పై కోపంతోనో లేక ఆ దేశానికి సర్ది చెప్పగల సామర్థ్యమున్న అమెరికా పట్టించుకోవడం లేదనో ఇరాన్ కనక ఈ జలసంధిని మూసేసిందంటే.. చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలకు చుక్కలు కనిపించడం ఖాయం!. ప్రతి రోజు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి! ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపు తప్పుతుంది.:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా