
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించింది. అమెరికా ప్రతిపాదించిన ఈ ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మంగళవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. అదే సమయంలో ఇరాన్ అణు-క్షిపణి ముప్పును తొలగించడంలో విజయం సాధించాం అని పేర్కొన్నారాయన.
ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. ‘‘ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను నిర్వీర్యం చేయడంలో విజయం సాధించాం. తద్వారా ముప్పును తొలగించగలిగాం. ఈ విషయంలో సహకరించడంతో పాటు రక్షణ సహకారం అందించిన ట్రంప్నకు కృతజ్ఞతలు. ఈ విజయానికి ప్రతిగా.. ట్రంప్నకు పూర్తి సహకారం అందిస్తాం. ఆయన ప్రతిపాదించిన పరస్పర కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నాం.’’ అని నెతన్యూహు పేర్కొన్నారు. అయితే.. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే గనుక ఇజ్రాయెల్ ధీటుగానే స్పందిస్తుందని ఇరాన్ను హెచ్చరించారాయన. అయితే నెతన్యాహు అణు ముప్పు తొలగిందన్న వ్యాఖ్యలకు ఇరాన్ స్పందించాల్సి ఉంది.
12 రోజుల యుద్ధం ముగిసిందని, ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే తొలుత ఇరాన్ ఈ ప్రకటనను తోసిపుచ్చుతూ.. భిన్నమైన ప్రకటనలు చేసింది. ఈలోపు మంగళవారం ఉదయం ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడంతో యుద్ధం కొనసాగుతోందని అంతా భావించారు. ఈ దాడుల్లో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే కాసేపటికే కాల్పుల విరమణ మొదలైందని టెహ్రాన్ వర్గాలు అధికారికంగా ప్రకటించగా.. కాసేపటికే ఇజ్రాయెల్ కూడా ఆ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.
ట్రంప్ ప్రతిపాదన ప్రకారం.. 24 గంటల్లో తొలి 12 గంటలు ఇరాన్ కాల్పుల విరమణ పాటించాలి. ఆ తర్వాత 12 గంటలు ఇజ్రాయెల్ ఒప్పందాన్ని పాటిస్తుంది. దీంతో కాల్పుల విమరణ ఒప్పందం సంపూర్ణంగా అమలు అయినట్లే. అయితే ఇది శాశ్వత పరిష్కారమా? కాదా? అనేదానిపై మరికొన్ని గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.