
పశ్చిమాసియా యుద్ధవాతావరణానికి ఎట్టకేలకు తెరపడింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య 12 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ముగిసింది!. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇరాన్ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకుముందు.. ఈ ప్రకటన చేసే చివరి నిమిషం వరకూ ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు కొనసాగించడం గమనార్హం.
ఇరాన్- ఇజ్రాయెల్ (Iran- Israel) మధ్య కాల్పుల విరమణ జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ ఒప్పందానికి సంబంధించి తాజాగా ఆయన ట్రూత్ సోషల్లో ఓ పోస్టు పెట్టారు.

సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిందని, ఎవరూ ఉల్లంఘించొద్దంటూ ఆయన పోస్ట్ చేశారు. తొలుత ఇరాన్, ఆపై ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటిస్తాయని, 24 గంటల్లో ఈ ఒప్పందం పూర్తిగా అమల్లోకి వస్తుందని తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించలేదు. అయితే బంకర్లలో దాక్కున్న తమ దేశ పౌరులను బయటకు రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో యుద్ధం ముగిసినట్లేనని స్పష్టమవుతోంది. అంతకు ముందు.. ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందంపై ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.
ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు ఒకేశారి ‘శాంతి’ అంటూ తన వద్దకు కాళ్లబేరానికి వచ్చాయని ట్రంప్ పేర్కొన్నారు. అక్కడ శాంతి అవసరం ఉందని తాను గుర్తించానన్నారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో పశ్చిమాసియాతో పాటు ప్రపంచం కూడా నిజమైన విజయం సాధించిందన్నారు. ఇరుదేశాలు భవిష్యత్తులో ప్రేమ, శాంతి శ్రేయస్సును చూస్తాయని తెలిపారు. అలా కాదని వారు నీతిని, సత్య మార్గాన్ని వదులుకుంటే రానున్న రోజుల్లో మరింత కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈలోపు ఇరాన్ ట్విస్ట్ ఇచ్చింది. ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదంటూనే.. ఒప్పందానికి సుముఖంగా ఉన్నట్లు, ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తామూ దాడులు ఆపుతామంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి సూచనప్రాయంగా పోస్టులు చేశారు. మరోవైపు.. ‘‘ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ట్రంప్ మా దేశాన్ని వేడుకున్నారు. ఖతార్లో అమెరికా వాయు స్థావరాలపై తాము దాడులు చేసిన వెంటనే కాళ్ల బేరానికి వచ్చారు’’ అంటూ ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ కథన ప్రసారం చేసింది.
ఆపై కొన్ని గంటల్లోనే టెల్అవీవ్పై టెహ్రాన్ క్షిపణులతో దాడులకు దిగింది. ఈ దాడుల్లో పలువురు మరణించారు. దీంతో పశ్చిమాసియలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగుతాయని భావించేలోపే.. కాసేపటికే ట్విస్ట్ ఇస్తూ ఇరాన్ కాల్పుల విరమణ మొదలైందంటూ ప్రకటన చేయించడం గమనార్హం. ఇరుదేశాల ఒప్పందం వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నాయి.