
టెహ్రాన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి ఇరాన్ ఊహించిన షాకిచ్చింది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం సందర్భంగా తమపై అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాతో ఎలాంటి అణుచర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు.
అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ వచ్చేవారం ఇరాన్తో అణుచర్చలు జరగనున్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలపై తాజాగా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. ఈ సందర్బంగా అబ్బాస్.. అమెరికాతో అణు ఒప్పందానికి సంబంధించి సమావేశమయ్యే ఆలోచన మాకు లేదు. ఇటీవల ఇరాన్పై అమెరికా చేసిన దాడులు గణనీయమైన నష్టాన్ని కలిగించాయి. ఇరాన్ అణు కార్యక్రమం పునరుద్ధరణపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో అమెరికాతో చర్చల్లో పాల్గొనే ఆలోచనే లేదు అని కుండబద్దలు కొట్టారు.
#Iran's Foreign Minister Seyed Abbas Araghchi says that no arrangement or commitment was made to resume negotiations with the United States, amid heightened tensions following attacks by Israel and United States on Iranian territory.
File Photo pic.twitter.com/LZruhGwi4K— All India Radio News (@airnewsalerts) June 27, 2025
మరోవైపు.. నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. వచ్చేవారం టెహ్రాన్తో అణుచర్చలు జరుపుతామన్నారు. అణ్వాయుధాలు తయారుచేయాలన్న ఆశయాన్ని వదిలేసేలా ఇరాన్తో ఒప్పందం చేసుకొనే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఇరాన్ చమురుపై ఆంక్షల విషయంలో కూడా చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు ట్రంప్ హింట్ ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్పై యుద్ధంలో ఇరాన్ విజయం సాధించిందని, అమెరికా జోక్యం చేసుకోకుండా ఉంటే ఆ దేశం నాశనమయ్యేదని ఇరాన్ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. ఖతార్లోని అమెరికా స్థావరంపై దాడి చేసి అగ్రరాజ్యాన్నీ చాచి చెంపదెబ్బ కొట్టామని అన్నారు. మళ్లీ తమపై దాడి చేసే ప్రయత్నం చేస్తే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్లోని మూడు అణుకేంద్రాలపై బంకర్ బ్లస్టర్ బాంబులు, క్రూజ్ క్షిపణులతో అమెరికా చేసిన దాడులు విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఈ దాడుల్లో అగ్రరాజ్యం ఏమీ సాధించలేకపోయిందని అన్నారు. ఖతార్లో అమెరికా స్థావరంపై తాము చేసిన దాడికి చాలా ప్రాధాన్యం ఉందని చెప్పారు. అమెరికా స్థావరాలకు చేరగల సత్తా తమ దేశానికి ఉందని నిరూపితమైందని అన్నారు. భవిష్యత్తులోనూ అవసరమైన సందర్భాల్లో ఇలాంటి దాడులు చేస్తామని అమెరికాను ఖమేనీ హెచ్చరించారు.