మార్కెట్లలో ఈ వారం బ్రేకవుట్‌!  | U.S. involvement in Israel-Iran conflict could affect stock markets | Sakshi
Sakshi News home page

మార్కెట్లలో ఈ వారం బ్రేకవుట్‌! 

Jun 23 2025 6:21 AM | Updated on Jun 23 2025 8:05 AM

U.S. involvement in Israel-Iran conflict could affect stock markets

కన్సాలిడేషన్‌ నుంచి బయటపడే చాన్స్‌ 

ఇరాన్, ఇజ్రాయెల్‌ యుద్ధం ఎఫెక్ట్‌ 

చమురు, డాలరుపై ఇన్వెస్టర్ల దృష్టి 

మార్కెట్‌ ట్రెండ్‌పై నిపుణుల విశ్లేషణ

సుమారు ఐదు వారాలుగా దేశీ స్టాక్‌ మార్కెట్లు పరిమిత శ్రేణి(కన్సాలిడేషన్‌ జోన్‌)లోనే కదులుతున్నాయి. అయితే ఈ వారం మార్కెట్లు కన్సాలిడేషన్‌ నుంచి బయటపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు దేశీయంగా లేదా అంతర్జాతీయంగా ప్రభావిత అంశాలు కొరవడినప్పటికీ సాంకేతికంగా అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. వివరాలు చూద్దాం..     

గత వారం చివర్లో ఉన్నట్టుండి దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం ముదురుతున్న పరిస్థితుల్లోనూ ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ స్పీడందుకున్నాయి. ఫలితంగా మార్కెట్లు కొద్ది వారాలుగా చిక్కుకున్న కన్సాలిడేషన్‌ పరిధిని చేదించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ గత వారాంతాన సాంకేతికంగా పరివర్తన స్థాయి(25,112)కి చేరుకున్నట్లు చెబుతున్నారు. 

ఫలితంగా 25,200 పాయింట్ల ఎగువకు చేరి నిలదొక్కుకుంటే సాంకేతికంగా బ్రేకవుట్‌కు వీలున్నట్లు అంచనా వేశారు. దీంతో సమీప కాలంలో 25,600–25,800 పాయింట్లను తాకవచ్చని విశ్లేíÙంచారు. ఇలాకాకుండా బలహీనపడితే సైడ్‌వేస్‌లో కదలవచ్చని పేర్కొన్నారు. పశి్చమాసియాలో యుద్ధం ముదిరితే మార్కెట్లు క్షీణించవచ్చని తెలియజేశారు. దీంతో గత వారం మాదిరే 24,700 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు.  

రుతుపవనాలకు ప్రాధాన్యత 
దేశీయంగా నైరుతి రుతుపవన కదలికలు కీలకంగా మారనున్నాయి. మే నెలలోనే దేశంలోకి ప్రవేశించడం ద్వారా ఆశలు రేపినప్పటికీ తదుపరి మందగించిన సంగతి తెలిసిందే. అయితే రెండు, మూడు రోజుల్లో తిరిగి ఊపందుకుని పలు ఉత్తరాది రాష్ట్రాలలో విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో సెంటిమెంటు బలపడనున్నట్లు స్టాక్‌ నిపుణులు పేర్కొన్నారు. 

దీనికితోడు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటం సానుకూల పరిణామమని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆటుపోట్ల మధ్య కన్సాలిడేషన్‌ కొనసాగవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా, వాటర్‌ఫీల్డ్‌ అడ్వయిజర్స్‌ లిస్టెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ విపుల్‌ భోవర్‌ అభిప్రాయపడ్డారు. 

ఫెడ్‌పై చూపు 
గత వారం పాలసీ సమీక్షలో ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌కమిటీ(ఎఫ్‌వోఎంసీ) వడ్డీ రేట్లను యథాతథంగా అమలు చేసేందుకే ఓటేసింది. ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ అధ్యక్షతన సమావేశమైన ఎఫ్‌వోఎంసీ వరుసగా నాలుగోసారి ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లను 4.25–4.5 శాతంగా కొనసాగించేందుకు నిర్ణయించింది. ఇంతక్రితం 2024 డిసెంబర్‌లో 0.25 శాతం వడ్డీ రేటును తగ్గించిన ఫెడ్‌ తదుపరి నిర్వహించిన సమావేశాలలో యథాతథ పాలసీ అమలుకే ఓటు వేస్తూ వస్తోంది.

 అయితే ఈ నిర్ణయాలతోపాటు.. ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థలపై ఫెడ్‌ అభిప్రాయాలను పావెల్‌ కాంగ్రెస్‌కు వివరించనున్నారు. మంగళవారం(24న) ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ కమిటీముందు, బుధవారం(25న) సెనేట్‌ బ్యాంకింగ్‌ కమిటీ ముందు ఫెడ్‌ అంచనాలను వెల్లడించనున్నారు. మరోపక్క యూఎస్‌ క్యూ1 జీడీపీ తుది గణాంకాలు గురువారం(26న) వెల్లడికానున్నాయి. 2025 జనవరి–మార్చిలో యూఎస్‌ జీడీపీ 0.2 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే.

చమురు ధరలు కీలకం 
ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ హర్ముజ్‌ జలసంధిని మూసివేసే వీలున్నట్లు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్‌పై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఇది జరిగితే చమురు ధరలకు రెక్కలురానున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్య వివాదం తలెత్తిన వెంటనే బ్రెంట్‌ చమురు ధర ఒక్కో బ్యారల్‌కు 78 డాలర్ల గరిష్టానికి ఎగసిన విషయం విదితమే. 

ఫలితంగా యుద్ధ ప్రభావం ప్రధానంగా ముడిచమురు ధరలపై కనిపించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దేశీయంగా అధిక శాతం చమురు అవసరాలకు గల్ఫ్‌ దేశాలపై ఆధారపడుతున్న నేపథ్యంలో యుద్ధ సెగలు దేశీ మార్కెట్లను దెబ్బతీయవచ్చని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా, జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

గత వారమిలా.. 
గత వారం(16–20) ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు బలపడ్డాయి. తొలుత క్షీణపథంలో ట్రేడయినప్పటికీ వారం చివర్లో జోరందుకున్నాయి. దీంతో నికరంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ గత వారం 1,290 పాయింట్లు(1.6 శాతం) ఎగసింది. 82,408 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 394 పాయింట్లు(1.6 శాతం) పుంజుకుని 25,112 వద్ద నిలిచింది. అయితే చిన్న, మధ్యతరహా కౌంటర్లలో అమ్మకాలదే పైచేయి అయ్యింది. వెరసి బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.45 శాతం క్షీణించగా.. స్మాల్‌ క్యాప్‌ దాదాపు 2 శాతం పతనమైంది.  

 – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement