గణాంకాలపై మార్కెట్‌ ఫోకస్‌! | stock market and analyst projections on this week | Sakshi
Sakshi News home page

గణాంకాలపై మార్కెట్‌ ఫోకస్‌!

Jun 8 2026 6:16 AM | Updated on Jun 8 2026 6:17 AM

stock market and analyst projections on this week

పశ్చిమాసియా పరిస్థితులు కీలకం 

నేడు ప్రపంచ మార్కెట్ల ప్రభావం 

ఈ వారం మళ్లీ ఆటుపోట్లకు చాన్స్‌ 

స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనా

దేశీ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం పలు అంశాల ఆధారంగా కదలనున్నాయి. ప్రధానంగా పలు దేశ, విదేశీ గణాంకాలు వెలువడనున్నాయి. మరోపక్క రోజుకో మలుపు తీసుకుంటున్న పశ్చిమాసియా పరిస్థితులు కీలకం కానున్నాయి.  

గత వారాంతాన యూఎస్‌ మార్కెట్లతోపాటు.. పసిడి, వెండి తదితర కమోడిటీలలో అమ్మకాలు వెల్లువెత్తాయి. యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు 1.5–4% మధ్య క్షీణించగా.. బంగారం 3 శాతం, వెండి 6.5% చొప్పున పతనమయ్యాయి. ముడిచమురు, కాపర్, నేచురల్‌ గ్యాస్‌ సైతం 2–4 శాతం మధ్య నీరసించాయి. ఇందుకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. యూఎస్‌ లీజర్, హెల్త్‌కేర్, ఆతిథ్య రంగాల దన్నుతో మే నెలలో ఉపాధి గణాంకాలు అంచనాలను మించాయి. 

దీంతో కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు పెరిగి ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 100కు బలపడింది. మరోపక్క ఏఐ సవాళ్లతో టెక్నాలజీ స్టాక్స్‌లో తలెత్తిన భారీ అమ్మకాలు నాస్‌డాక్‌ను 4% పడగొట్టినట్లు తెలిపా రు. కాల్పుల విరమణ అంటూనే యూఎస్, ఇరాన్‌ మధ్య దాడులు కొనసాగుతుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.   

నేడు అటూఇటుగా 
గత వారం చివర్లో యూఎస్‌ మార్కెట్లు, కమోడిటీలలో నమోదైన అమ్మకాల ప్రభావం నేడు దేశీయంగా కనిపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గత వారం విడుదలైన దేశ జీడీపీ గణాంకాలు, ఆర్‌బీఐతోపాటు ప్రభుత్వం చేపట్టిన విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహకాల నిబంధనల సవరణలు కొంతమేర ఇన్వెస్టర్లను ఆకట్టుకునే వీలున్నట్లు వివరించారు.

 రాజకీయ, భౌగోళిక అనిశ్చితి, చమురు ధరల కారణంగా ఎదురవుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో ఈ ఆర్థిక సంవత్సరం(2026–27) దేశ జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్‌బీఐ తగ్గించడం కొంతమేర ప్రతికూలమేనని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులకు ఆర్‌బీఐ దన్ను, బలపడిన డాలరు.. రూపాయిపై ప్రభావం.. ఇవన్నీ కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా తెలియజేశారు. వెరసి నేడు మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొనే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 

రుతుపవనాలపై దృష్టి
ఇటీవల ఆశలు రేపుతున్న రుతుపవనాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. మే నెలకు ద్రవ్యోల్బణ గణాంకాలు 12న వస్తాయి.  ఈ అంశాలన్నిటికీ ప్రాధాన్యత ఉన్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. గ్లోబల్‌ ఐటీ దిగ్గజాల్లో అమ్మకాలు దేశీయంగానూ ప్రభావం చూపవచ్చని లివ్‌లాంగ్‌ వెల్త్‌ రీసెర్చ్‌ నిపుణులు కె.హరిప్రసాద్‌ చెప్పారు.

సాంకేతికంగా చూస్తే.. 
సాంకేతిక నిపుణుల అంచనాల ప్రకారం గత వారం సెన్సెక్స్‌ మద్దతు స్థాయిలకు సమీపంలో నిలిచినప్పటికీ బలహీనంగానే కనిపిస్తోంది. మరోపక్క 23,500 పాయింట్లను దాటలేకపోతున్న నిఫ్టీ మరింత బలహీనపడే వీలుంది. వెరసి ఈ వారం నిఫ్టీ 23,000 పాయింట్ల దిగువకు 22,900కు చేరవచ్చు. బలపడితే 23,500 వద్ద రెసిస్టెన్స్‌కు అవకాశముంది.  

గత వారం డీలా 
విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర విక్రయాల నేపథ్యంలో గత వారం(1–5) హెచ్చుతగ్గుల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్‌ నికరంగా 532 పాయింట్లు(0.7%) నష్టపోయి 74,243 వద్ద ముగిసింది. నిఫ్టీ 181 పాయింట్లు(0.76%) క్షీణించి 23,367 వద్ద స్థిరపడింది.  

ఎఫ్‌పిఐ అమ్మకాల దెబ్బ 
కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు చేపడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెల తొలి వారంలోనూ ఇదే ధోరణి కొనసాగించారు. వెరసి జూన్‌ తొలి వారంలో రూ. 43,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ కేలండర్‌ ఏడాది(2026)లో ఇప్పటివరకూ రూ. 2.67 లక్షల కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు.

 ఇది సరికొత్త రికార్డ్‌కాగా..  ఎన్‌ఎస్‌డీఎల్‌ వివరాల ప్రకారం 2025లో వెనక్కి తీసుకున్న పెట్టుబడులు రూ. 1.66 లక్షల కోట్లను ఇవి దాటేశాయి. బలహీన కార్పొరేట్‌ ఫలితాలు, రూపాయి క్షీణత, గ్లోబల్‌ మార్కెట్లలో ఆకర్షణీయ అవకాశాలు తదితర అంశాలు ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మినహా అన్ని నెలల్లోనూ ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగానే నిలవడం గమనార్హం! మార్చిలో అత్యధికంగా రూ. 1.17 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు.
     
– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement