ప్రపంచ కుబేరుడు.. టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి జాతి వివక్ష ఆరోపణల నేపథ్యంలో వార్తల్లో నిలిచారు. అయితే.. ఈసారి సోషల్ మీడియాలో స్పందించకుండా, తన కుటుంబం గురించే ప్రస్తావిస్తూ తాను జాతి వివక్షను నమ్మే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
తన భార్య శివోన్ జిలిస్ భారతీయ మూలాలున్న మహిళ అని మస్క్ వెల్లడించారు. ఆమె తల్లి భారతీయురాలు. అయితే జిలిస్ కెనడాలో పెరిగిందని చెప్పారు. తమకు నలుగురు పిల్లలు ఉన్నారని, వారిలో ఒక కుమారుడికి భారతీయ సంతతికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పేరు పెట్టాము. అలాంటప్పుడు నన్ను జాతి వివక్షవాదిగా ఎలా అంటారు?, అని మస్క్ ప్రశ్నించారు.
మస్క్ కుమారుడి పేరు స్ట్రైడర్ శేఖర్ సిరియస్. నక్షత్రాల పరిణామం, నిర్మాణంపై చేసిన అద్భుతమైన కృషికి గాను 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న భారత సంతతికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్కు నివాళిగా 'శేఖర్' అనే మధ్య పేరు పెట్టారు. ఈ విషయాన్ని మస్క్ నిఖిల్ కామత్తో జరిగిన ఒక పాడ్కాస్ట్లో చెప్పారు.
జాతి వివక్ష ఆరోపణలకు కారణం
గత కొంతకాలంగా వలసలు, జాతి అంశాలు, రాజకీయాలపై మస్క్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. యూరప్లోని కొన్ని మితవాద రాజకీయ పార్టీలకు ఆయన మద్దతు ఇవ్వడం, వలసలపై చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. దీంతో ఆయనపై జాతి వివక్ష ఆరోపణలు కూడా వచ్చాయి.
అయితే.. ఈ ఆరోపణలను మస్క్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. తన కుటుంబం వివిధ సంస్కృతులు, భిన్న నేపథ్యాల కలయికకు నిదర్శనమని, అలాంటి వ్యక్తిని జాతి వివక్షవాదిగా చెప్పడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తన వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యమే ఈ ఆరోపణలకు సమాధానమని మస్క్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అమెరికా అప్రమత్తం.. AI నియంత్రణకు కొత్త చట్టం!


