మస్క్ హెచ్చరిక.. టిమ్ కుక్ షాక్! | AI Boom Triggers Global Memory Chip Shortage Driving Up Tech Prices | Sakshi
Sakshi News home page

మస్క్ హెచ్చరిక.. టిమ్ కుక్ షాక్!

Jun 30 2026 6:20 PM | Updated on Jun 30 2026 7:37 PM

AI Boom Triggers Global Memory Chip Shortage Driving Up Tech Prices

కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. అయితే ఈ సాంకేతిక విప్లవం కొత్త అవకాశాలను మాత్రమే కాదు, కొత్త సవాళ్లను కూడా తీసుకొస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌ల కొరత తీవ్రమవడంతో యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపుతోంది.

యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఈ పరిస్థితిని 'వందేళ్లలో ఒకసారి వచ్చే వరద'తో పోల్చారు. గత 40 ఏళ్లలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, తాను ఇప్పటివరకు చూసిన వాటిలో ఇదే అతిపెద్ద ధరల పెరుగుదల అని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే.. ప్రస్తుతం మెమరీ చిప్‌ల కొరత ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది.

ఈ సమస్యకు ప్రధాన కారణం ఏఐ రంగం వేగంగా విస్తరించడం. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు భారీ డేటా సెంటర్ల నిర్మాణానికి వందల బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం. ఈ డేటా సెంటర్లకు అధిక సామర్థ్యం గల మెమరీ చిప్‌లు అవసరం అవుతున్నాయి. ఫలితంగా చిప్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని ఎక్కువగా ఏఐ సర్వర్ల కోసం కేటాయిస్తున్నాయి. దీంతో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల వంటి వినియోగదారుల ఉత్పత్తులకు అవసరమైన మెమరీ చిప్‌ల సరఫరా తగ్గిపోయింది.

ప్రస్తుతం DRAM (యాప్‌లు పనిచేయడానికి ఉపయోగించే మెమరీ), NAND (ఫొటోలు, వీడియోలు, ఫైళ్లను నిల్వ చేసే స్టోరేజ్ చిప్‌లు) ధరలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ భారీ ధరల పెరుగుదల కారణంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ వ్యయం కూడా గణనీయంగా పెరిగింది.

ఈ పరిస్థితుల్లో యాపిల్ చాలా కాలం వరకు అదనపు ఖర్చును వినియోగదారులపై మోపకుండా భరించింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి సాధ్యం కాకపోవడంతో కంపెనీ మ్యాక్‌బుక్, ఐమ్యాక్‌, ఐప్యాడ్‌, హోమ్‌ప్యాడ్‌, యాపిల్ టీవీ వంటి ఉత్పత్తుల ధరలను 15 నుంచి 25 శాతం వరకు పెంచింది.

ఉదాహరణకు, మ్యాక్‌బుక్ ఎయిర్ ధర 200 డాలర్లు పెరిగి 1,299 డాలర్లకు చేరగా, మ్యాక్‌బుక్ ప్రో ధర 300 డాలర్లు పెరిగి 1,999 డాలర్లకు చేరింది. అలాగే ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. మైక్రోసాఫ్ట్ కూడా తన Xbox గేమింగ్ కన్సోళ్ల ధరలను 100 నుంచి 150 డాలర్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అంటే మెమరీ చిప్‌ల కొరత ప్రభావం మొత్తం టెక్నాలజీ పరిశ్రమపైనే పడుతోంది.

ఈ సమస్యను పరిష్కరించాలంటే మెమరీ చిప్‌ల ఉత్పత్తిని భారీగా పెంచాలని ఎలాన్ మస్క్ సూచించారు. భవిష్యత్తులో ఏఐ అభివృద్ధికి మెమరీ చిప్‌లే అతిపెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అందుకే టెస్లా, స్పేస్‌ఎక్స్, ఇంటెల్ కలిసి అత్యాధునిక చిప్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికను కూడా ప్రకటించారు.

ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్‌కు భారీ నష్టం.. కారణం ఇదేనా?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement