న్యూఢిల్లీ: ముత్తూట్ పప్పచాన్ గ్రూప్ కంపెనీ ముత్తూట్ ఫిన్కార్ప్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది.
ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ మొత్తం తాజా ఈక్విటీ జారీ ద్వారా నిధులను సమకూర్చుకోనుంది. భవిష్యత్ అవసరాల కోసం టైర్–1 మూలధనాన్ని పెంచుకునేందుకు ఐపీవో పెట్టుబడులను వెచ్చించనుంది. డైవర్సిఫైడ్ ఎన్బీఎఫ్సీ ముత్తూట్ ఫిన్కార్ప్ ప్రధానంగా బంగారు ఆభరణాలపై రుణాలందిస్తోంది. అయితే బిజినెస్ రుణాలు, ఆస్తులపై రుణాలు, సప్లై చైన్ ఫైనాన్సింగ్, డిజిటల్ రుణాలు, మైక్రోఫైనాన్స్, గృహ రుణాలు తదితరాలతో పోర్ట్ఫోలియోను విస్తరించింది.
రెండు దశాబ్దాలుగా బంగారు ఆభరణాలపై రుణాలు సమకూర్చుతోంది. దేశవ్యాప్తంగా బ్రాంచీల నెట్వర్క్ను విస్తరించింది. 2026 మార్చి 31కల్లా నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) రూ. 73,445 కోట్లకు చేరాయి. 5,610 బ్రాంచీలను కలిగి ఉంది.


